నగరంలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతున్నది. నిన్నామొన్నటి వరకు అంతంతమాత్రంగా ఉన్న పార్టీ పరిస్థితి..నేడు మరింత దయనీయంగా మారింది. పార్టీ నాయకత్వంపై నమ్మకం లేని నేతలు ఒక్కొక్కరూ పార్టీని వీడుతున్నారు. కమల దళం నాయకత్వంపై విశ్వాసం సన్నగిల్లి, అంతర్గత కలహాలు పెరిగిపోయి ఆ పార్టీలో చేరికలకు పూర్తిగా ఫుల్స్టాప్ పడింది. కొత్తగా పార్టీలో చేరేవారెవరూ లేకుండా పోయారు. ఇందుకు కారణం కేంద్రమంత్రి, అధ్యక్షుడు కిషన్రెడ్డేనని ఆ పార్టీలో అంతర్మథనం జరుగుతున్నది. ఇదే సమయంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు పెరుగుతున్నాయి. ముందుగానే అభ్యర్థులను ప్రకటించి క్షేత్రస్థాయిలో దూసుకుపోతూ ప్రజల నుంచి విశేష స్పందన అందుకుంటున్న గులాబీ దళంలో భాగస్వాములయ్యేందుకు పలువురు బీజేపీ నేతలు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కిషన్రెడ్డి ఇలాకాలోనే కమలానికి బిగ్ షాక్ తగిలింది. బీజేపీకి చెందిన బాగ్ అంబర్పేట్ కార్పొరేటర్ పద్మ, 43 ఏండ్లుగా ఆ పార్టీకి సేవలందిస్తూ జోగుళాంబ గద్వాల జిల్లా బీజేపీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న ఆమె భర్త వెంకట్రెడ్డి శుక్రవారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ల సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. మంత్రి కేటీఆర్ వారికి బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అయితే నగరంలో మరికొన్ని నియోజకవర్గాల్లోనూ ఇవే సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నాయకత్వంపై నమ్మకం సన్నగిల్లిన మరో ముగ్గురు కార్పొరేటర్లు, గోషామహల్కు చెందిన మరికొందరు నాయకులు రేపోమాపో బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీలో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలతో గ్రేటర్ బీజేపీ కకావికలమవుతున్నది.
– సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబరు 22 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ బీజేపీ ఉక్కిరిబిక్కిరవుతున్నది. అసలే గ్రేటర్లో ఆ పార్టీ పరిస్థితి అంతంత మాత్రం… పైగా కీలక నేతలు ఒక్కొక్కరూ పార్టీని వీడుతుండటం ఒక వంతైతే… సొంతగూటిలోని అంతర్గత పోరుతో వచ్చే ఒకటీ, రెండూ చేరికలు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. ప్రధానంగా అధికార బీఆర్ఎస్ పార్టీ ముందుగానే అభ్యర్థులను ప్రకటించి… క్షేత్రస్థాయిలో దూసుకుపోతుండటం, ప్రజల్లో విశేష స్పందన కనిపిస్తుండటంతో బీజేపీ నుంచి నెమ్మదిగా ఆ పార్టీ నేతలు జారుకుంటున్నారు. గులాబీ కండువా కప్పుకొని బీఆర్ఎస్ పార్టీ జైత్రయాత్రలో భాగస్వాములయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఇలాకాలోనే కమలానికి బిగ్ షాక్ తగలడమే కాకుండా మరికొన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే సంకేతాలు కనిపిస్తుండటంతో గ్రేటర్ బీజేపీని కలవరపెడుతున్నది. ఎన్నికల ముందే ఈ పరిస్థితి ఉంటే… సమరం మొదలు కాగానే గ్రేటర్ బీజేపీలో మిగిలే కీలక నేతలెందరు? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, బీజేపీకి చెందిన బాగ్ అంబర్పేట్ కార్పొరేటర్ పద్మ, 43 ఏండ్లుగా ఆ పార్టీకి సేవలందిస్తూ.. జోగుళాంబ గద్వాల జిల్లా బీజేపీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న ఆమె భర్త వెంకట్రెడ్డి శుక్రవారం మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.
కిషన్రెడ్డి కేంద్ర బిందువుగా…
తాజాగా వెంకట్రెడ్డి, ఆయన భార్య కార్పొరేటర్ పద్మ బీజేపీని వీడిన ఎపిసోడ్లో ఆద్యంతం కిషన్రెడ్డి కేంద్ర బిందువుగానే కనిపిస్తున్నారు. ఇద్దరు నిర్వహించిన మీడియా సమావేశంలోనూ ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టారు. గతంలో ఆలె నరేంద్రతో బీజేపీలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన వెంకట్రెడ్డి… తదుపరి కిషన్రెడ్డి వెన్నంటే ఉన్నారు. ఈ క్రమంలో కిషన్రెడ్డి లోక్సభకు వెళ్లిన నేపథ్యంలో ఇప్పటికైనా అంబర్పేట నుంచి తనకు అవకాశం వస్తుందని ఆశించారు. ఈ మేరకు ఇటీవల అంబర్పేట నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తూ దరఖాస్తు కూడా చేసుకున్నారు. కానీ కిషన్రెడ్డి నుంచి స్పందన లేకపోవడం వెనక ఆయన భార్యకు ఈ దఫా అంబర్పేట నుంచి టికెట్ ఇప్పించుకోవాలనే ఉద్దేశమే కారణమని వెంకట్రెడ్డి విమర్శిస్తున్నారు. అందుకే ‘అంబర్పేటలో ఎప్పుడూ కిషన్రెడ్డి కుటుంబమేనా?’ అని సూటిగా ఆరోపణలు చేశారు. మరోవైపు ఇటీవల రెండు చేరికల విషయంలోనూ కిషన్రెడ్డిపైనే విమర్శలు వినిపించాయి. మాజీ మంత్రి కృష్ణాయాదవ్ బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకొని పెద్ద ఎత్తున ర్యాలీగా రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అధికారికంగానూ ప్రకటించుకున్నారు. తీరా… అసలు సమయం వచ్చేసరికి కిషన్రెడ్డి మొహం చాటేయడంతో చేరిక నిలిచిపోయింది. ఈ సందర్భంగా కిషన్రెడ్డి వర్సెస్ ఈటల అంతర్గత పోరు కారణమనే ప్రచారం గుప్పుమన్నది. అదేవిధంగా చీకోటి ప్రవీణ్ కూడా బీజేపీలో చేరేందుకు రాష్ట్ర పార్టీ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి వెనుదిరిగారు. ఈ సమయంలో కిషన్రెడ్డి వర్సెస్ బండి అంతర్గత పోరు కారణమని పార్టీవర్గాలే పెదవి విరిచాయి. దీంతో ఒకవైపు ఉన్న వారు పార్టీని వీడుతుంటే… వచ్చే ఒకరిద్దరు కూడా అంతర్గత పోరుతో ఆగిపోవడం గ్రేటర్ బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది.
నాలుగున్నర దశాబ్దాల పాటు..
నాలుగున్నర దశాబ్దాల పాటు ఒకే పార్టీలో ఉండి సేవ చేయడమనేది సాధారణ విషయం కాదు. కార్యకర్త నుంచి కీలక నేతగా ఎదిగిన అలాంటి వ్యక్తి పార్టీని వీడటమనేది ప్రాధాన్యత ఉన్న అంశమే. అందునా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మూడు పర్యాయాలు ప్రాతినిధ్యం వహించిన అసెంబ్లీ స్థానమే కాకుండా ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నాయకుడు కావడమనేది మరో కీలకాంశం. అంబర్పేట నియోజకవర్గానికి చెందిన బీజేపీ ముఖ్య నేత వెంకట్రెడ్డి తన భార్య, కార్పొరేటర్ పద్మతో పాటు కాషాయ పార్టీని వీడి శుక్రవారం మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరడం గ్రేటర్ బీజేపీని కలవరానికి గురి చేసింది. 43 ఏండ్ల పాటు బీజేపీకి సేవలందించడంతో పాటు కిషన్రెడ్డి వరుస విజయాల్లో కీలక పాత్ర పోషించిన నాయకుడు కావడంతోనే ఆయనకు జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. అంతేకాదు… గతంలో రెండు పర్యాయాలు గ్రేటర్ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించిన అనుభవం ఉన్న వెంకట్రెడ్డి పార్టీని వీడటంతో అంబర్పేట కాషాయ దళానికి భారీ దెబ్బ తగలినైట్లెయ్యింది. ఈ క్రమంలో గ్రేటర్ పరిధిలోని శివారు నియోజకవర్గానికి చెందిన మరో ముగ్గురు బీజేపీ కార్పొరేటర్లు కూడా త్వరలో బీఆర్ఎస్లో చేరేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు తెలిసింది. అంతేకాకుండా గోషామహల్ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు కీలక నేతలు కూడా త్వరలోనే కారెక్కేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తాజాగా భారీ షాక్ తిన్న గ్రేటర్ బీజేపీకి త్వరలోనే దెబ్బ మీద దెబ్బ పడటం ఖాయంగా కనిపిస్తున్నది.
రాజీనామాకు ముందు కన్నీటి పర్యంతం..
అంబర్పేట, సెప్టెంబర్ 22 : బీజేపీకికి రాజీనామా చేసే ముందు బి. పద్మావెంకట్రెడ్డి దంపతులు వారి నివాసంలో మీడియాతో మాట్లాడారు. పార్టీ కోసం 43 ఏండ్లుగా కష్టపడి పని చేశామని, పార్టీని వీడిపోతున్నందుకు ఎంతో బాధకలుగుతున్నదని చెప్పారు. కొన్ని పరిస్థితుల దృష్ట్యా పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరుతున్నామన్నారు. ఇంత వరకు తమకు సహకరించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ కన్నీటి పర్యాంతమయ్యారు. పార్టీలో అనేక బాధ్యతలు నిర్వర్తించామని, ఒక బాధ్యత కోసం ప్రయత్నిస్తే.. పార్టీ నిర్లక్ష్యం చేయడంతో బాధకలిగిందని చెప్పారు. 25 రోజులుగా కుటుంబ సభ్యులమంతా ఎంత బాధపడుతున్నామో మాకు తెలుసన్నారు. ఇంత వరకు ఎలాంటి స్పందన లేకపోవడమే కాకుండా ఫోన్ కూడా చేయలేదని వాపోయారు. పార్టీ మారాలంటే ఎప్పుడో మారేవాడినని, ఇప్పుడు అనుకోకుండా పార్టీ మారే పరిస్థితిని కల్పించారని వెంకట్రెడ్డి పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో అంబర్పేట నుంచి పోటీ చేస్తానని రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని అడిగితే సరైన సమాధానం చెప్పడంలేదని పేర్కొన్నారు. తాను పార్టీని బలోపేతం చేస్తే కిషన్రెడ్డి వచ్చి టికెట్ తన్నుకుపోయారని మండిపడ్డారు. ఎప్పుడు కిషన్రెడ్డి కుటుంబం నుంచే పోటీ చేయాలా అని ప్రశ్నించారు. పార్టీ నాశనానికి కిషన్రెడ్డినే కారణమని దుమ్మెత్తిపోశారు. బీఆర్ఎస్లో కూడా ఒక ధృడమైన కార్యకర్తగా పని చేస్తానని వెల్లడించారు.