బంజారాహిల్స్, అక్టోబర్ 5: భార్యను వేధిస్తున్నాడన్న కోపంతో సొంత తమ్ముడిని అత్యంత కిరాతకంగా గొంతుకోసి హత్య చేసిన ఘటన ఫిలింనగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఫిలింనగర్లోని బసవతారకనగర్ బస్తీలో నివాసముంటున్న షబ్బీర్ అహ్మద్, సజ్జీ అహ్మద్ (39) సోదరులు. వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వారితో పాటే అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి కూడా ఉంటున్నాడు. రెండునెలల కిందట షబ్బీర్ అహ్మద్ భార్య పుట్టింటికి వెళ్లి.. తిరిగి రాలేదు. విషయం తెలుసుకోగా.. మరిది సజ్జీఅహ్మద్ తనను తీవ్రంగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని, కాపురానికి రాలేనని భర్తకు ఫిర్యాదు చేసింది.
దీంత్ అనారోగ్యంతో ఉన్న తండ్రిని చూసుకునేందుకు ఇంట్లో ఆడమనిషి లేకపోవడంతో షబ్బీర్ అహ్మద్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. భార్య కూడా పుట్టింటికి వెళ్లిపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తన తమ్ముడి లైంగిక వేధింపుల వల్లే భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని నిర్దారణకు వచ్చిన షబ్బీర్ అహ్మద్.. తమ్ముడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి వరకు తమ్ముడి చేత మద్యం తాగించిన షబ్బీర్ అహ్మద్.. అతడు నిద్రపోయాడని నిర్ధారించుకున్న తర్వాత కూరగాయలు కోసే కత్తితో షజ్జీ అహ్మద్ గొంతు కోశాడు. అంతటితో ఆగకుండా మెడవైపు కూడా కోయడంతో తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
గురువారం తెల్లవారుజామున రెండున్నర సమయంలో తమ్ముడిని చంపేశానంటూ డయల్ 100కు షబ్బీర్ అహ్మద్ ఫోన్చేసి చెప్పాడు. దీంతో అప్రమత్తమైన జూబ్లీహిల్స్ ఏసీపీ హరిప్రసాద్, ఫిలింనగర్ ఇన్స్పెక్టర్ రామకృష్ణతో పాటు సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. షబ్బీర్ అహ్మద్ను అదుపులోకి తీసుకున్నారు.