సిటీబ్యూరో, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : నాణ్యమైన విద్యా విధానానికి జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు కేరాఫ్గా నిలుస్తున్నాయి. సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లలో సాధించిన విద్యా ప్రగతిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. గతంలో సర్కారు స్కూల్స్కు రావాలంటేనే చిన్నచూపుగా భావించే విద్యార్థులు ఇప్పుడు అదే ప్రభుత్వ బడికి అడ్మిషన్ పొందడానికి పోటీ పడుతున్నారు. ప్రభుత్వ బడుల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు, వాటి నిర్వహణ, అవసరమైన సదుపాయాలతో పాటు రక్షిత మంచినీటి సదుపాయాలకు చర్యలు తీసుకుంటున్నది. మన బస్తీ – మనబడి కింద జిల్లాలోని దాదాపు ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తుండగా… ప్రతి యేడాది విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెంచుకోవడానికి బడిబాట కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అధికారులు నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్ద పీట వేయడంతో పాటు జిల్లాలో ఆలియా, మహబూబియాతో పాటు అనేక సర్కారు స్కూల్స్ను అభివృద్ధి చేసింది. దీంతో పాటు ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధన అందించడం వల్ల ప్రైవేటు నుంచి సర్కారు స్కూళ్లకు వలస వస్తున్నారు. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలో మొత్తం 12,816 అడ్మిషన్లు కొత్తగా నమోదవ్వగా… ఇప్పటి వరకు దాదాపు 529 ప్రైవేటు స్కూల్స్ నుంచి ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు వచ్చారు. జిల్లాలో 282 ప్రభుత్వ పాఠశాలలను మనబస్తీ-మనబడి కింద ఎంపిక చేశారు. ఈ మొత్తానికి దాదాపు రూ.50 కోట్ల వరకు నిధులు కేటాయించినట్లు సమాచారం. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రస్తుతం ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే 15 నియోజకవర్గాల్లో 21 పాఠశాలలను ఎంపిక చేశారు. అయితే ఎంపిక చేసిన 21 పాఠశాలల్లో అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. మిగిలిన ఏడు స్కూళ్లలో దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు డీఈవో ఆర్ రోహిణి తెలిపారు. ఈ మేరకు జాబితా విడుదల చేశారు.