సిటీబ్యూరో, ఫిబ్రవరి 06 (నమస్తే తెలంగాణ ) : మూసీ నదికి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెంచాలని నిర్ణయించింది. ఇప్పటికే హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) విభాగాన్ని ఏర్పాటు చేసి కబ్జాలకు అస్కారం లేకుండా ఫెన్సింగ్ పనులు చేపట్టారు. దోమల నియంత్రణకు ప్రత్యేక నివారణ చర్యలు తీసుకున్నారు. ప్రయోగాత్మకంగా నాగోల్ సమీపంలో పచ్చదనం పెంపు లాంటి చర్యలు చేపట్టారు. ఈ సమయంలోనే స్వచ్ఛ జలాలుగా మార్చడం, నగర చారిత్రక వైభవం చాటేలా, స్థానికత ప్రతిబింబించేలా మూసీ నదిపై పారిస్ తరహాలో బ్రిడ్జిలు కట్టాలని నిర్ణయించారు.
ఈ మేరకు రూ. 545 కోట్లతో మూసీపై 14 బ్రిడ్జిలు, ఓ అనుసంధాన రహదారి నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేయగా..డిజైన్ల రూపకల్పన తుది దశకు చేరింది. ఇందులో భాగంగానే తాజా బడ్జెట్లో మూసీ అభివృద్ధికిగానూ రూ.200కోట్లు కేటాయించారు. త్వరలోనే ఈ పనులు ప్రారంభించేందుకు ఎంఆర్డీసీఎల్ అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కాగా గతేడాది తరహాలోనే జీహెచ్ఎంసీకి బడ్జెట్ కేటాయించారు. జీహెచ్ఎంసీ సిబ్బంది వేతనాలు, ఇతర భత్యాలకు రూ.7.83 కోట్లు, ప్రభుత్వ భవనాలకు సంబంధించి ఆస్తిపన్ను రూ.10కోట్లు కేటాయించారు. కాగా వృత్తి పన్ను నష్ట పరిహారం రూ.10 కోట్లు కేటాయించారు. మొత్తంగా రూ.27.83కోట్లు జీహెచ్ఎంసీకి కేటాయింపులు జరిపారు.
ప్రజల ఆకాంక్షల బడ్జెట్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ
మియాపూర్ , ఫిబ్రవరి 6 : రాష్ట్రంలోని నలుమూలల నివసించే అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా తెలంగాణ బడ్జెట్ ఉన్నదని విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ఉద్యమ నేత సీఎం కేసీఆర్ నిర్దేశనంలో మంత్రి హరీశ్రావు శాసన సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజారంజకంగా ఉందని, క్లిష్ట పరిస్థితులలోనూ ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేసేలా ఉందని ప్రశంసించారు. తెలంగాణ శాసనసభలో రూ.2.90 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో విప్ గాంధీ నియోజకవర్గ ప్రజల తరపున
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు కృతజ్ఞతలు తెలిపారు.
దేశానికే దిక్సూచిలా తెలంగాణ బడ్జెట్ తుంగ బాలు, ఓయూ పరిశోధక విద్యార్థి
ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 6 : అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్ ప్రజా సంక్షేమం, అభివృద్ధే శిరోధార్యంగా ఉందని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఓయూ పరిశోధక విద్యార్థి తుంగ బాలు అన్నారు. ఈ బడ్జెట్ దేశంలోని ఇతర రాష్ర్టాలకు దిక్సూచిలా నిలిచిందన్నారు. బీఆర్ఎస్ స్థాపించి దేశ రాజకీయాల్లో ప్రవేశించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఎజెండాను రాష్ట్ర బడ్జెట్ రూపంలో ప్రజల ముందు ఉంచారని కొనియాడారు. కేంద్రప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకుండానే రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్దేనని కీర్తించారు. విద్యారంగానికి అధిక నిధులు కేటాయించడంతో పాటు రాష్ట్రంలోని యూనివర్సిటీలలో హాస్టళ్ల పునర్నిర్మాణానికి దాదాపు రూ.500 వందల కోట్లు కేటాయించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.