సిటీబ్యూరో, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : వచ్చే వేసవి ముగింపు నాటికల్లా నాలాల పూడికతీత పనులు పూర్తి చేయాలని బల్దియా నిర్ణయించింది. ఏటా సుమారు రూ. 45 కోట్ల ఖర్చుతో 884.15 కిలోమీటర్ల మేర నాలాల్లో పూడిక తొలగింపు పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే ఈ సారి కూడా జనవరిలో ఈ ప్రక్రియ ప్రారంభించి.. జూన్ నాటికల్లా దాదాపు 5 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికతీతను చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు.. పనుల కోసం టెండర్లు ఆహ్వానించనున్నారు.
వచ్చే మూడు వారాల్లో టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి.. జనవరి రెండో వారానికల్లా పూడికతీత పనులను ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నారు. కాగా, బల్దియా పరిధిలో 1368 కిలోమీటర్ల మేర నాలాలు, వరద కాలువలు ఉన్నాయి. ఏటా ఐదు లక్షల క్యూబిక్ మీటర్ల మేర నాలాల పూడికతీత పనులు చేపడుతున్నారు. గతంలో మాదిరిగానే ఈ సారి కూడా నాలాల్లో పూడిక తొలగింపు పనులు ఆరుగురు ఎస్ఈలు, ఆయా జోనల్ కమిషనర్ల పర్యవేక్షణలో సాగనున్నాయి. ప్రత్యేక యాప్, వెబ్సైట్ ద్వారా ఏ రోజు ఎక్కడ పనులు జరుగుతున్నాయి? ఏ మేరకు జరిగాయనే అంశాలను పర్యవేక్షిస్తూ పనులను అత్యంత పారదర్శకంగా నిర్వహించనున్నారు.