సిటీబ్యూరో, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): సామాన్యులపై భారం మోపే మరిన్ని నిర్ణయాలతో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సిద్ధమైంది. ప్రజా సౌకర్యాల కంటే ప్రైవేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చే అంశాలకే కమిటీ సభ్యులు ఆసక్తి చూపిస్తున్నారు. క్రీడా మైదానాల నుంచి శ్మశాన వాటికల వరకు అన్నింటినీ ప్రైవేట్ ఏజెన్సీలకు కట్టబెట్టేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ఖైరతాబాద్ జోన్లో పది క్రీడా ప్రాంగణాలను ప్రైవేట్ పరం చేసిన అధికారులు..తాజాగా మరో మూడు చోట్ల క్రీడా మైదానాలను ప్రైవేట్ పరం చేసేందుకు నేడు (సోమవారం) జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశం ముందుకు ప్రతిపాదనలు పెట్టారు.
కేపీహెచ్బీ కాలనీ (5వ ఫేజ్)లోని క్రికెట్ ప్రాక్టీస్ పిచ్ల నిర్వహణకు నెలకు రూ. 59,639 బేస్ ప్రైస్తో ఈవోఐ ఆహ్వానించనున్నారు. కేపీహెచ్బీ (9వ ఫేస్)లోని ఇండోర్ షటిల్ కోర్టు నిర్వహణ ఫీజును 15 శాతం పెంచి, నెలకు రూ. 59,513గా ఖరారు చేసి ప్రతిపాదించారు. బాలానగర్ ఫ్లైఓవర్ కింద ఖాళీ స్థలాన్ని ఏడాది పాటు స్పోర్ట్స్ ఎరీనాగా మార్చనున్నారు. అలాగే నెక్సస్ మాల్ ఫె్లైఓవర్ కింద ఉన్న స్పోర్ట్స్ ఎరీనా నిర్వహణకు నెలకు రూ. 1.14 లక్షల బేస్ ప్రైస్తో టెండర్లు పిలించేందుకు స్టాండింగ్ కమిటీ ఆమోదానికి అధికారులు ప్రతిపాదనలు సభ్యులకు అందజేశారు.
ఆదాయ వనరులుగా క్రీడా ప్రాంగణాలు
జీహెచ్ఎంసీ ఆస్తులను అధికారులు ఒక్కొక్కటిగా ప్రైవేట్పరం చేస్తున్నారు..మౌలిక వసతుల కల్పన, మెరుగైన నిర్వహణతో సంస్థకు ఆదాయాన్ని సమకూర్చుకునే వనరులను సైతం ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నది. పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన క్రీడలను సైతం ఖరీదుగా మార్చే నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. ప్రభుత్వ నిర్వహణలో ఉన్నప్పుడు నామమాత్రపు ఫీజులతో అందుబాటులో ఉన్న ఈ ప్రాంగణాలు, ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంతో వ్యాపార కేంద్రాలుగా మారనున్నాయి.
కేవలం డబ్బున్న వారికే ఈ సౌకర్యాలు పరిమితమయ్యే ప్రమాదం ఉంది. బస్తీల్లో ఉండే పేద క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకోవడానికి వేల రూపాయల ఫీజులు కట్టలేక ప్రతిభావంతులైన క్రీడాకారులు ఈ సౌకర్యాలకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రజాధనంతో నిర్మించిన ఈ కాంప్లెక్స్లను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడంపై నగరవాసులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి క్రీడా ప్రాంగణాల ప్రైవేటీకరణ ముసుగులో జరుగుతున్న ఈ రాజకీయ దందాను అరికట్టకపోతే నగరంలో క్రీడా స్ఫూర్తి కనుమరుగైపోయే ప్రమాదం ఉంది.
స్టాండింగ్ కమిటీ ముందుకు ప్రతిపాదనలు ఇవే
మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ అధ్యక్షతన సోమవారం (ఫిబ్రవరి 9) మధ్యాహ్నం 3 గంటలకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో 12వ స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనున్నది. మేయర్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో సుమారు 9 కీలక అంశాలకు ఆమోదం తెలపనున్నారు. ప్రధానంగా వరద నీటి కాలువలు, క్రీడా సముదాయాల నిర్వహణ, ఆస్తుల పన్ను అధికారాల బదలాయింపు వంటి అంశాలు ఎజెండాలో ఉన్నాయి.
మూసాపేట సరిల్ యూసుఫ్ గూడలోని వైకుంఠధామం (హిందూ శ్మశాన వాటిక) నిర్వహణకు సంబంధించి కమిటీ కీలక నిర్ణయం తీసుకోనుంది. అంతిమ సంసారాల కోసం ఒక మృతదేహానికి రూ. 7,500 ఫీజుగా నిర్ణయించారు. ఇందులో రూ. 500 జీహెచ్ఎంసీకి వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. అత్యధిక వాటా ఇచ్చే బిడ్డర్లకు నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తారు.
ఆస్తిపన్ను, ఖాళీ స్థలాల పన్ను వసూలు అధికారాలను జోనల్, డిప్యూటీ కమిషనర్లకు బదలాయిస్తూ కమిషనర్ తీసుకున్న నిర్ణయానికి ఈ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు. జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ (అడ్మిన్) కె. వేణుగోపాల్కు కొన్ని ప్రత్యేక అధికారాలను అప్పగిస్తూ చేసిన ప్రతిపాదనను కమిటీ సభ్యులు ధృవీకరించనున్నారు.