Hyderabad Metro | సిటీబ్యూరో, మార్చి 2 (నమస్తే తెలంగాణ): పార్లమెంటు ఎన్నికల కోడ్ వచ్చేలోపే మెట్రో రెండో దశకు శంకుస్థాపన చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. దీని ద్వారా ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూస్తున్నది. నగరంలో మెట్రో రెండో దశకు డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను రూపొందించాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించింది. మొత్తం 7 కారిడార్లలో 70 కి.మీ మేర మార్గాలను నిర్మించాలని, అందుకోసం 3 నెలల్లో డీపీఆర్ను సిద్ధం చేయాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆ పనులు క్షేత్ర స్థాయిలో జరుగుతున్నాయి. డీపీఆర్ పూర్తి కావడానికి ఇంకా రెండు నెలల సమయం పట్టే అవకాశమున్నది. ఈలోపే పార్లమెంటు ఎన్నికల జరగనుండటంతో ప్రభుత్వం మెట్రో రెండో దశ శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని అధికారులను తొందరపెడుతున్నది. వివిధ మార్గాల్లో రకరకాల అంశాలపై అధ్యయనం చేస్తూ డీపీఆర్ రూపొందించే పనిలో ఉన్న మెట్రో అధికారులకు.. శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలన్న ఒత్తిడి పెరిగింది. ఇప్పటికే ప్రకటించిన రెండో దశ మెట్రో ప్రతిపాదనల్లో ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు ఉన్న 5.5 కి.మీ.. మొదటి దశ మెట్రో ప్రాజెక్టులో అనుమతులు ఉన్న మార్గమే. అయినా దాన్ని రెండో దశలో చేర్చి మొత్తం 70 కి.మీ మార్గాన్ని ప్రతిపాదించారు. ఈ పనులు వెంటనే చేపట్టేందుకు అవకాశం ఉన్నా..చేపట్టకుండా డీపీఆర్ రూపకల్పనే మెట్రో అధికారులు కసరత్తు చేస్తున్నారు.
మెట్రో రెండో దశకు సంబంధించిన డీపీఆర్ పూర్తయితేనే ప్రాజెక్టు వ్యయంపై ఒక అంచనా వస్తుంది. ఈ ప్రాజెక్టును క్షేత్ర స్థాయిలో చేపట్టాలంటే మొదట డీపీఆర్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డీపీఆర్కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ అనుమతి రావాలి. అదే విధంగా నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ సమకూరితేనే క్షేత్ర స్థాయిలో మెట్రో పనులు చేపట్టేందుకు అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం ఇవేవి సిద్ధంగా లేవు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రో రెండో దశకు శంకుస్థాపన చేసి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నది. ఈనెల రెండో వారంలోనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న సమాచారం ఉండటంతో ఈలోపు మెట్రో రెండో దశకు శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని మెట్రో అధికారులకు సూచించడంతో అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసే పనిలో వారు తలమునకలై ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్టుకు పూర్తి స్థాయి కార్యరూపం రావాలంటే కనీసం 9 నెలలు సమయం పడుతుందనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.