చిక్కడపల్లి, జూలై 17: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రంథాలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నది. గడిచిన తొమ్మిదేండ్ల కాలంలో కోట్లాది రూపాయల వ్యయంతో చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయంతో పాటు అనుబంధంగా ఉన్న 82 గ్రంథాలయాలను అభివృద్ధి చేసింది. ప్రతి గ్రంథాలయంలో అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు విద్యార్థులు చదువుకోవడానికి పుస్తకాలను అందుబాటులో ఉంచారు. రాష్ట్ర ప్రభుత్వం వరుసగా పోటీ పరీక్షలకు నోటిఫికేషన్ వేయడంతో విద్యార్థులు గ్రంథాలయాల్లోనే పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.
రూ.5 కోట్లతో చిక్కడపల్లి నగర గ్రంథాలయం అభివృద్ధి
చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయానికి (శ్రీవట్టికోట అళ్వారు స్వామి) పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ గ్రంథాలయానికి ఐదు కోట్లు వెచ్చించి అభివృద్ధి చేశారు. భవనంలో అభ్యర్థులు చదువుకోవడానికి అన్ని వసతులు కల్పించారు. ఫ్లోరింLibraryగ్, ఎలక్ట్రిసిటీ, టాయిలెట్స్, విద్యుత్ దీపాలు, మంచినీటి కోసం ఆర్వో ప్లాంట్తో పాటు అభ్యర్థుల కోసం రూ.5 భోజనం కేంద్రం ఏర్పాటు చేశారు. అంతేకాకుండా దాదాపు రూ.65 లక్షల వ్యయంతో పుస్తకాలను అందుబాటులోకి తెచ్చారు.
సుందరంగా మారిన భవనాలు
శిథిలావస్థకు చేరుకున్న గ్రంథాలయాల భవనాల స్థానంలో నూతన భవనాలు నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా రూ.9 కోట్ల వ్యయంతో మొత్తం 14 నూతన భవనాలు నిర్మిస్తున్నారు. గతంలో రూ.2 కోట్ల 12లక్షలతో 33 భవనాలకు మరమ్మతులు చేపట్టగా., మరో రూ.72 లక్షల వ్యయంతో 14 భవనాలను అభివృద్ధి చేశారు. సికింద్రాబాద్లో రూ.3 కోట్ల వ్యయంతో సకల వసతులతో కూడిన జీ+2 మాడ్రన్ గ్రంథాలయ భవనాన్ని నిర్మించారు.
పెద్ద ఎత్తున నిధులు మంజూరు
గతంలో చదువుకోవడానికి గ్రంథాలయాలకు వచ్చే అభ్యర్థులకు అన్ని సమస్యలే ఎదురయ్యేవి. కనీసం టాయిలెట్స్ లేని దుస్థితి ఉండేది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడంతో సకల వసతులతో సుందరంగా మారాయి. పాఠకులతో పాటు అభ్యర్థులకు అవసరమైన పుస్తకాలను అందుబాటులోకి తెచ్చాం.
– ప్రసన్నరామ్మూర్తి, నగర కేంద్ర గ్రంథాలయం చైర్పర్సన్