మారేడ్పల్లి : కంటోన్మెంట్ నియోజకవర్గం వెస్ట్ మారేడ్పల్లి లో 5.8 ఎకరాల విస్తీర్ణంలో 36.27 కోట్ల రూపాయాల వ్యయంతో నూతనంగా నిర్మించిన 468 డబుల్ బెడ్ రూం ఇండ్లను ఈ నెల 3న ఉదయం 9:30 గంటలకు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభిస్తారని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
468 ఇండ్ల నిర్మాణం కోసం 37.76 కోట్ల రూపాయాలను ఖర్చు చేయగా, 3.51 కోట్ల రూపాయాల వ్యయంతో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యాలు కల్పిండంతో పాటు, మంచినీటి సౌకర్యం కోసం 50వేల లీటర్ల సామర్థ్యం కలిగిన 4 సంపులను నిర్మించడం జరిగిందని వివరించారు. హౌజింగ్ బోర్డుకు చెందిన ఈ స్థలంలో అనేక మంది నిరుపేదలు సరైన సౌకర్యాలు లేక, ఇరుకైన ఇండ్లలో జీవనం సాగించే వారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో సీఎం కేసీఆర్ దృష్టికి తాను ఈ ప్రాంతంలోని పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులను తీసుకెళ్ల డం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి చొరవతో ముందుగా హౌసింగ్ బోర్డుకు చెందిన ఈ స్థలాన్ని రెవెన్యూ శాఖకు బదిలీ చేసి లబ్దిదారులకు పొజిషన్ సర్టిఫికెట్లను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
అనంతరం డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపట్టి పూర్తి చేసినట్లు మంత్రి వెల్లడించారు. పేద ప్రజలు అన్ని వసతులు, సౌకర్యాలు కలిగిన సొంత ఇంటిలో సంతోషంగా, ఎంతో గొప్పగా బ్రతకాలనేది ముఖ్యమంత్రి లక్ష్యం అని చెప్పారు. ప్రభుత్వమే పూర్తి ఖర్చుతో ఇండ్లను నిర్మించి లబ్దిదారులకు అందజేసే మహోన్నత కార్యక్రమం దేశంలో ఎక్కడా అమలు కావట్లేదని అన్నారు.
బుధవారం ఉదయం 10 గంటలకు డబుల్ బెడ్ రూం ఇండ్లను సందర్శించి ప్రారంభోత్సవ ఏర్పాట్లను అధికారులతో సమీక్షించనున్నట్లు మంత్రి తెలిపారు.