కేపీహెచ్బీ కాలనీ, డిసెంబర్ 29 : ప్రజా పాలన కేంద్రాల వద్ద గ్యారంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని.. ఎవరూ జిరాక్స్ సెంటర్లకు వెళ్లి ఇబ్బందులు పడొద్దని కూకట్పల్లి జోన్ కమిషనర్ వి.మమత అన్నారు. శుక్రవారం జోన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జోన్ పరిధిలో వార్డుకు 4 కేంద్రాల చొప్పున 88 కేంద్రాలలో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఆయా కేంద్రాల వద్ద ప్రజలకు ఉచితంగా దరఖాస్తులు అందిస్తున్నట్లు తెలిపారు. జనవరి 6 వరకు దరఖాస్తుల స్వీరణ ఉంటుందని ఫుడ్ సెక్యూరిటీ కార్డు లేనివారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చాన్నారు. దళారులు, ఇతరుల మాటలు నమ్మి మోసపోవద్దని.. పేదలంతా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
ప్రజా పాలన కేంద్రాలో పేదలందరూ దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందాలని కార్పొరేటర్ పగుడాల శిరీషాబాబూరావు అన్నారు. శుక్రవారం వివేక్నగర్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. కాలనీలు, బస్తీలలో నివసించే పేదలు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బాబూరావు, భాస్కర్రావు, బండి సుధ తదితరులున్నారు.