చండీగఢ్: పంజాబ్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆంక్షలు, మార్గదర్శకాలను సోమవారం జారీ చేసింది. సోమవారం నుంచి ఈ నెలాఖరు వరకు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తారు. ఈ నెల 30 వరకు బార్లు, సినిమా హాళ్లు, జిమ్స్, స్పాలు, కోచింగ్ సెంటర్లను మూసివేస్తారు. హోటళ్లు, రెస్టారెంట్లలో మాత్రం సోమవారం నుంచి శనివారం వరకు టేక్ అవేకు మాత్రమే అనుమతిస్తారు. వివాహాలు, అంత్యక్రియలకు 20 మంది కంటే ఎక్కువగా అనుమతించరు. పది మంది కంటే ఎక్కువ మంది పాల్గొనేందుకు జిల్లా యంత్రాంగం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది.
రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ఈ మేరకు కఠిన నిబంధనలు విధిస్తున్నట్లు సీఎం అమరేందర్ సింగ్ తెలిపారు. కరోనాపై సోమవారం సమీక్షా సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆర్టీ-పీసీఆర్ టెస్ట్కు రూ.450, ఆర్టీఏ టెస్ట్కు రూ.300 మాత్రమే వసూలు చేయాలని ప్రైవేట్ ల్యాబ్స్ను ఆదేశించారు.