నగరానికి ప్రాణాధారమైన మూసీ నదికి పునర్జీవం పోస్తామంటూ గొప్పలు చెప్పుకొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. విదేశీ కార్పొరేట్ మాయలో పడిందని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్ కమిటీ పౌర సమాజం సమర్పించిన నివేదికలను కనీసం కంటితోనైనా చూడకపోవడం పాలకుల అహంకారానికి అద్దం పడుతోందని పేర్కొన్నాయి.
సిటీబ్యూరో, జూలై 1(నమస్తే తెలంగాణ) : జీవనదిని శుద్ధి చేయడమంటే మురుగునీటిని వందశాతం మళ్లించి, స్వచ్ఛమైన నీటి ప్రవాహం అందించడమే ప్రజలు కోరుకుంటున్నారన్నారు. అంతరాయం లేని ప్రవాహం, స్వచ్ఛమైన మూసీ నదిని మాత్రమే జనాలకు అవసరమన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నా గోడలు, కమర్షియల్ ల్యాండ్ స్కేపింగ్, నది తీరంలో ఆధ్యాత్మిక నిర్మాణాలపై సర్కార్ శ్రద్ధ పెడుతుందే తప్ప.. నది కాలుష్యాన్ని తగ్గించే మార్గాలను అన్వేషించడం లేదన్నారు.
దీనికోసం వేలాది కోట్ల రూపాయలను విదేశీ కార్పొరేట్ సంస్థల నుంచి అప్పులు తెచ్చి… భవిష్యత్ తరాలను అప్పుల ఊబిలోకి నెట్టే పునర్జీవం అక్కర్లేదన్నారు. ప్రభుత్వ అనాలోచిత విధానాలకు హిమయత్సాగర్ రిజర్వాయర్ వ్యవహారమే నిదర్శనమని ప్రజా సంఘాలు మండిపడ్డాయి. జలాశయం ఇంకా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరక ముందే, భవిష్యత్లో నగర తాగునీటి అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా మూసీ నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాయి.
గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్లోని మూసీ నది రిజర్వాయర్లకు నీటిని తరలించే ప్రాజెక్టుకు ఎలాంటి సామాజిక-శాస్త్రీయ ఆధారాలు లేవని హైడ్రాలజీ నిపుణులు తేల్చి చెబుతున్నారు. అసలు మూసీ నది క్యాచ్మెంట్ ఏరియా, జంట జలాశయాల పరివాహాక ప్రాంతాలు, నార్త్-సౌత్ బేసిన్లతో కూడిన మొత్తం నది హైడ్రాలజీని పరిగణనలోకి తీసుకోకుండా కేవలం నగర పరిధిలోని మూసీపైనే దృష్టి పెట్టడం వెనుక ఉన్న మతలబు ఏంటనీ? వివిధ ప్రాంతాల్లో నది అసలు వెడల్పు, లోతు ఎంత అనే అధికారిక సమాచారాన్ని కూడా పబ్లిక్ డొమైన్లో ఉంచకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.
అంత గోప్యం ఎందుకు?
ఈ ప్రాజెక్టులో నదీ పునర్జీవం ఎంత ముఖ్యమో, ప్రజాధనంతో చేపట్టే ఈ ప్రాజెక్టులో పారదర్శకత అంతే కీలకమని ప్రజా సంఘాల నాయకులు స్పష్టం చేశారు. అయితే ప్రాజెక్టుకు సంబంధించిన సంప్రదింపుల మినిట్స్, నది డిజిటల్ మ్యాపింగ్తో కూడిన కేఎంఎల్ ఫైల్ కోసం దాఖలు చేసిన దరఖాస్తులను ప్రభుత్వం తొక్కిపెడుతుందన్నారు. ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న ఈ ప్రాజెక్టు సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముందనీ, ప్రభుత్వం తక్షణమే మూసీ ప్రాజెక్టుపై సమగ్రమైన శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.