సిటీ బ్యూరో, జూలై 11 (నమస్తే తెలంగాణ): రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసింది. విద్యార్థులకు కనీస వసతులు కల్పించక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసినా భోజనం, తాగునీరు, వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహించడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. అదే తరహాలో మూడు నెలలుగా నీళ్లు లేకపోవడంతో చైతన్యపురిలోని సరూర్నగర్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల విద్యార్థినులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ప్రాంగణంలోని బోరు ఎండిపోయి, మున్సిపల్ నీళ్లు చాలినన్ని రాకపోవడంతో స్నానాలు కూడా చేయలేని దుస్థితి ఏర్పడింది. ఆఖరికి అన్నం తిందామన్నా మరుగుదొడ్డికి వెళ్లాల్సి వస్తుందేమోనని పస్తులుంటున్నారు. నీళ్లు సరిగ్గా లేకపోవడంతో మల, మూత్ర విసర్జన వల్ల మరుగుదొడ్లు దుర్వాసన వెదజల్లుతున్నాయి. అటు వెళ్లాలంటేనే విద్యార్థినులు జంకుతున్నారు. స్నానాలు చేసేందుకు బట్టలు ఉతుక్కునేందుకు అదే ప్రాంగణం లో ఉన్న లా ఉమెన్స్ కళాశాల నుంచి బకెట్లలో తీసుకురావాల్సి వస్తున్నది. బకెట్లలో ఐదు ఫోర్లు మోసుకుపోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్యాంకర్తో నీటిని కొనుగోలు చేసినా అవి ఏ మూలకూ సరిపోవడంలేదు. నీటి సమస్యపై ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేస్తే.. ఉన్నంతలో సర్దుకుపోవాలని ఆదేశిస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. నీళ్లు సరిగ్గా లేవని ఎవరికైనా చెప్తే ఇంటర్నల్ మార్కులు కట్చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రిన్సిపాల్ నిర్లక్ష్యమే శాపం..
చెతన్య పురిలోని కృష్ణవేణినగర్ క్యాంపస్లో టీజీఎస్డబ్ల్యూఆర్ఎస్ మహిళల లా కాలేజీ-ఎల్బీనగర్, టీజీడబ్ల్యూఆర్ఎస్ బాలికల పాఠశాల, కళాశాల ఉన్నాయి. లా కాలేజీలో నీటి వసతి సరిగ్గానే ఉన్నది. కానీ పాఠశాలలోనే ఎండాకాలం ప్రారంభం నుంచి బోరునీరు సరిపోకపోవడంతో ట్యాంకర్ ద్వారా సరఫరా చేస్తున్నారు. వర్షాలు రాకపోవడంతో పరిస్థితి మరింత తీవ్రమై విద్యార్థినులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దిక్కుతోచని పరిస్థితుల్లో తల్లిదండ్రులకు చెప్పుకుంటే వారు ఎన్నోసార్లు ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు.
దీంతో చేసేదేమీ లేక తల్లిదండ్రులు వందలాదిగా వచ్చి ప్రిన్సిపాల్, జోనల్ ఆఫీసర్ను కలిసి సమస్యను వివరించారు. అయినా స్పందించకపోవడంతో టీజీడబ్ల్యూఆర్ఎస్ కార్యదర్శికి కూడా వినతి పత్రం ఇచ్చారు. అయినా ఫలితం లేకపోవడంతో పాఠశాలలో నిరసన చేపట్టారు. ప్రిన్సిపాల్ మాత్రం నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ సమస్యను పరిష్కరిస్తామని.. బయట ఎవరికీ చెప్పొద్దని ఆదేశిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. విద్యార్థినులను సైతం సమస్యపై మాట్లాడితే బెదిరింపులకు పాల్పడుతున్నట్లు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

