సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 20 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జిల్లెలగూడలోని చందన చెరువు శిఖం కబ్జా తొలగింపులపై హైడ్రామా చోటు చేసుకుంది. సాక్షాత్తూ జిల్లా కలెక్టరేట్ నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ కిందిస్థాయి రెవెన్యూ అధికారులు ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదే ఆక్రమణదారులకు వరంగా మారుతుంది.
ఈ నేపథ్యంలో శిఖం భూముల్ని ఫలహారంగా పంచుకున్నారనేందుకు మరికొన్ని ఆధారాలు కూడా బయటికొస్తున్నాయి. నకిలీ పాత పాసు పుస్తకాలను అడ్డు పెట్టుకొని చెరువును చెరబడుతున్నప్పటికీ అధికారులు సరైన రీతిలో స్పందించడం లేదని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు నీటిపారుదల శాఖ అధికారులు కూడా చెరువు ఎఫ్టీఎల్ నిర్ధారణ చేపట్టేందుకు వస్తున్నట్లు సమాచారం ఇచ్చినప్పటికీ స్థానిక రెవెన్యూ యంత్రాంగం సహాయ నిరాకరణ చేపట్టడం మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనాన్ని చూసి క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చేందుకు సిద్ధమైన తమకు రికార్డులు ఇచ్చి సహకరించమంటే స్థానిక రెవెన్యూ అధికారుల నుంచి సానుకూల స్పందన లేదని సాక్షాత్తూ ఇరిగేషన్ డీఈ చెబుతుండటం గమనార్హం.
జిల్లెలగూడలో ఆర్సీఐకు వెళ్లే ప్రధాన రహదారి వెంట ఉన్న చందన చెరువు ఆక్రమణలో చిక్కుకున్న విషయం తెలిసిందే. దీనిపై స్థానికులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయగా… ల్యాండ్ ప్రొటక్షన్ అధికారులు సమగ్ర విచారణ చేసి మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆర్డీవో, తాసీల్దార్కు ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల కిందట ఇదే అంశంపై ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైంది. దీంతో అక్రమంగా ఇచ్చిన విద్యుత్ కనెక్షన్లను తొలగించాలంటూ విద్యుత్తు శాఖకు లేఖ రాసిన బాలాపూర్ తాసీల్దార్…
కబ్జాల తొలగింపునకు చర్యలు తీసుకుంటానని కూడా రెండు రోజుల కింద స్పష్టం చేశారు. కానీ తదుపరి చర్యలపై మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఫిర్యాదుదారులు దీనిపై ప్రశ్నించినప్పటికీ తమకు ఇతరత్రా పనులు ఉన్నాయంటూ దాట వేస్తున్నారు. కాగా కలెక్టర్ దృష్టికి వెళ్లిన కబ్జాలే కాకుండా ఇంకా చెరువు శిఖంలో మరిన్ని ఆక్రమణలు ఉన్నట్లు వివరాలు బయటికొస్తున్నాయి. పక్కనే ఉన్న పట్టా భూమిని ఆసరాగా చేసుకొని నకిలీ పాత పాసు పుస్తకాలు తయారు చేసి పలువురు శిఖం భూముల్ని చెరబట్టినట్లు తెలిసింది. వీటి ఆధారంగానే జీవో 59 కింద క్రమబద్ధీకరణ చేసుకునేందుకు పెద్ద ఎత్తున ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం.
చర్యలు తీసుకోక… సహకరించక…
చందన చెరువు కబ్జాలపై రెవెన్యూ యంత్రాంగం తీరు విచిత్రంగా కనిపిస్తున్నది. వాస్తవానికి లేక్ ప్రొటెక్షన్ కమిటీలో నీటిపారుదల, రెవెన్యూ, మున్సిపల్, పోలీసు శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనంతో తాము క్షేత్రస్థాయిలో విచారణ చేసేందుకు సిద్ధమైనట్లు నీటిపారుదల శాఖ డీఈ డీబీ నాయక్ తెలిపారు. అయితే శనివారం తాము క్షేత్రస్థాయికి వచ్చి, పరిశీలిస్తామని బాలాపూర్ తాసీల్దార్కు సమాచారమిచ్చినట్లు చెప్పారు. అయితే తమకు వేరే పని ఉన్నందున తాము రాలేమని తాసీల్దార్ చెప్పడంతో తాము కూడా విరమించుకున్నట్లు పేర్కొన్నారు.
చెరువు ఎఫ్టీఎల్ను తమ శాఖ నిర్ధారిస్తుందని, అందులో ఆక్రమణలు ఉంటే వాటిని గుర్తించాల్సిన బాధ్యత రెవెన్యూ యంత్రాంగంపై ఉందన్నారు. ముఖ్యంగా చెరువుకు సంబంధించిన రికార్డులన్నీ రెవెన్యూ శాఖ వద్ద ఉంటాయని, తాము క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలంటే రికార్డులు ఉంటే తప్ప సాధ్యం కాదన్నారు.
ఈ క్రమంలోనే శనివారం కబ్జాలపై విచారించేందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నప్పటికీ రెవెన్యూ అధికారులు రాలేమని చెప్పడంతో వెనక్కి తగ్గామన్నారు. కాగా చందన చెరువు శిఖం ఆక్రమణలపై తాసీల్దార్ తమకు కూడా సమాచారం ఇచ్చారని మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వాణిరెడ్డి తెలిపారు. అయితే ఆక్రమణల తొలగింపునకు సాయం చేసేందుకుగాను తమ సిబ్బందిని పంపిస్తానని చెప్పానని, తర్వాత ఎలాంటి సమాచారం లేదన్నారు.