సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ): మల్టీలెవల్ మార్కెటింగ్ జోలికి వెళ్లొద్దని నగర పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆశతో ఈ ఊబీలో చిక్కుకుంటే నష్టపోవడం తప్ప.. లాభాలు ఉండవని సూచిస్తున్నారు. ఇటీవల ఢిల్లీకి చెందిన ఓ ముఠా హైదరాబాద్లో తిష్టవేసి మల్టీలెవల్ మార్కెటింగ్ నిర్వహించి భారీ ఎత్తున మోసానికి పాల్పడి ఉడాయించింది. ఈ ముఠా కోసం గాలింపు చర్యలు చేపట్టిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు.. ఈ ముఠాలోని ప్రధాన నిందితులను అరెస్టు చేశారు. దేశ వ్యాప్తంగా ఈ ముఠా దాదాపు రూ.200 కోట్ల వరకు జనానికి మోసం చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.
చైన్ లింక్ విధానంతో..
మల్టీలెవల్ మార్కెట్ విధానంలో తొలుత ఓ వ్యక్తిని సభ్యుడిగా చేర్చుకుంటారు. ఆ సభ్యుడు మరో ఇద్దరిని, ఆ ఇద్దరు మరో నలుగురిని చేర్చుతూ.. పిరమిడ్ ఆకారంలో సభ్యులను ఈ స్కీమ్లలో చేర్చుతూ వెళ్తారు. ఈ విధానంతో మొదట్లో సభ్యులుగా చేరిన వారికి మాత్రమే లాభాలొస్తుంటాయి. ఆ తరువాత చేరిన వారికి ఎక్కడో ఓ దగ్గర చైన్ తెగిపోయి.. నష్టపోతారు. ఈ విధానంలో ఒకరి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి, అవే డబ్బులను మరికొందరికి కమీషన్ల రూపంలో ఇస్తూ వెళ్తుంటారు.
రాష్ట్రంలో నిషేధం..
ఇలాంటి మోసపూరిత స్కీమ్లపై తెలంగాణ రాష్ట్రంలో నిషేధం ఉంది. దీంతో ఈ స్కీమ్ల జోలికి వెళ్లవద్దని ప్రజలకు సూచనలిస్తూ, ఆయా స్కీమ్లు నిర్వహించే వారిపై తెలంగాణ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు టెక్నాలజీని ఉపయోగించి ఈ ముఠా కదలికలను గమనించి ఇటీవల అరెస్ట్ కూడా చేశారు.
ఢిల్లీ సంస్థ మోసం రూ.200 కోట్లు..
పర్ఫెక్ట్ హెర్బల్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఢిల్లీకి చెందిన రియాజుద్దీన్ అలియాస్ రియాజ్ అహ్మద్, షకీల్, పూజా కుమారి డైరెక్టర్లుగా ఉండి, హైదరాబాద్లో కొన్నాళ్లు వ్యాపారాన్ని నిర్వహించి బిచాణా ఎత్తివేశారు. ఈ ముఠా దేశ వ్యాప్తంగా రూ.200 కోట్లు వసూలు చేసింది.
తాజాగా.. సీసీఎస్లో మరో కేసు
విన్ఫినిత్, విశ్వశక్తి క్రియేటర్స్ పేరుతో కోయాల్కర్ శివ అనే వ్యక్తి మల్టీలెవల్ మార్కెటింగ్ నిర్వహిస్తూ సికింద్రాబాద్లోని ఎస్డీ రోడ్డులో సంస్థలు నిర్వహించాడు. ఈ సంస్థల్లో హస్తినాపురానికి చెందిన ఒక మహిళతో పాటు మరికొందరు పెట్టుబడులు పెట్టి, మరింత మందిని ఈ స్కీమ్లలో చేర్పించారు. ఈ స్కీమ్లో మొదట పెట్టుబడి పెట్టిన వారికి నిర్వాహకులు లాభాల రూపంలో డబ్బు చెల్లించారు. కొన్నాళ్ల తరువాత సంస్థ బిచాణా ఎత్తివేయడంతో బాధితురాలు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అన్ని స్కీమ్లు మోసాలే..
తమ వద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టి, మరికొందరిని సభ్యులుగా చేర్పించండి.. లాభాలతోపాటు కమీషన్ కూడా వస్తుందంటూ నమ్మిస్తూ అమాయకులను మల్టీలెవల్ మార్కెటింగ్ నిర్వాహకులు బుట్టలో వేస్తున్నారు. ఇలాంటి వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గొలుసు కట్టు విధానంలో జరిగే వ్యాపారాల జోలికి వెళ్లవద్దంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు. ఇలాంటి వ్యాపారాలు ఎవరి దృష్టికి వచ్చినా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సీపీ కోరారు.