GHMC | సిటీబ్యూరో, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ): పనిచేయకుండానే పనిచేసినట్లు నకిలీ ఫింగర్ ప్రింట్స్ను ఉపయోగించి రోజు వారీగా విధులకు హాజరైనట్లు రికార్డుల్లో చూపిస్తూ..బల్దియాకు గండి కొడుతున్న ముఠాను సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బల్దియాలోని శానిటేషన్ విభాగంలో పనిచేసే స్వీపర్లు క్షేత్ర స్థాయిలో హాజరవుతుంటారు. వీళ్లను జీహెచ్ఎంసీ సూపర్వైజర్లు పర్యవేక్షిస్తుంటారు. శానిటరీ సిబ్బంది బృందాలుగా ఉంటారు. ఒక్కో బృందంలో 12 నుంచి 16 మంది సిబ్బంది ఉంటారు. అయితే రోజు వారీగా విధులకు వచ్చిన రోజు బయోమెట్రిక్తో హాజరు తీసుకుంటారు. దీని ఆధారంగానే నెలల్లో సిబ్బంది ఎన్ని రోజులు హాజరయ్యారనే విషయాన్ని పరిగణలోకి తీసుకొని వేతనాలు చెల్లిస్తుంటారు.
ఇదే అదునుగా భావించిన సర్కిల్-16, సర్కిల్-14లోని కొందరు శానిటరీ కాంట్రాక్టర్లు, అధికారులు కలిసి పారిశుధ్య పనులు చేసే బృందాల్లో కొందరు బినామీ పేర్లను జోడించారు. వాళ్లకు సంబంధించిన నకిలీ ఫింగర్ ప్రింట్స్ తయారు చేశారు. ఆ బినామీలు రోజు వారీగా విధులకు హాజరవుతున్నట్లు అటెండెన్స్ వేస్తూ, నెల వారీగా వారి పేర్లపై వేతనాలు డ్రా చేస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ తతంగం నడుస్తున్నట్లు టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 40 వరకు నకిలీ ఫింగర్ ప్రింట్స్ను సేకరించినట్లు సమాచారం. ఈ దందాలో ఇంకెవరు ఉన్నారు..? కాంట్రాక్టర్లు, సిబ్బంది పాత్రపై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.