మణికొండ, మార్చి 23 (నమస్తే తెలంగాణ): ఓఆర్ఆర్పై దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూతుర్లు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ముందు వెళ్తున్న డీసీఎం వ్యాన్ చక్రం ఊడిపోవడంతో వెనుక నుంచి వచ్చిన ఫార్చునర్ కారు అదుపు తప్పి డీసీఎంను ఢీకొట్టింది. కారులో ఉన్న వాళ్లందరు గాయాలతో బయటపడ్డారనే విషయం తెలియగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదివారం రాత్రి మాగంటి అక్షిత నాగ, మాగంటి దిశిర, దుర్గ సాయి అరికెపుడి, మేడిపల్లి అభిరామ్రెడ్డి తదితరులు ఫార్చునర్ కారులో శంషాబాద్లోని ఎయిర్ పోర్టుకు నుంచి ఓఆర్ఆర్ మీదుగా గచ్చిబౌలి వైపు వెళ్తున్నారు.
నార్సింగి ప్రాంతంలోని టీజీపీఏ జంక్షన్ సమీపంలో ఐస్తో వెళ్తున్న డీసీఎం వెనుక టైరు బయటకు రావడంతో డీసీఎం అకస్మాత్తుగా నెమ్మదించింది. దీంతో వెనుక నుంచి వస్తున్న ఫార్చునర్ కారు అదుపు తప్పి డీసీఎం వ్యాన్ను ఢీకొట్టింది. కారును దుర్గసాయి నడుపుతున్నాడు. కారులో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. అక్షితను గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో చేర్పించగా కోలుకుందని, ఎవరికి ప్రాణాపాయం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. స్నేహితులను ఎయిర్పోర్టులో దింపి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు.