హయత్నగర్, మార్చి 26: రాష్ట్రంలోనే అభివృద్ధిలో ఎల్బీనగర్ కేరాఫ్ అడ్రస్గా మారిందని ఎంఆర్డీసీఎల్ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్ సూచన మేరకు బీఆర్ఎస్ పార్టీ వనస్థలిపురం డివిజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్ గుప్త ఆధ్వర్యంలో ఆదివారం వనస్థలిపురంలోని పిస్తాహౌస్ బ్యాంకెట్ హాల్లో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కాలనీ సంక్షేమ సంఘాలతో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి హాజరై మాట్లాడుతూ.. ఎన్నోసార్లు శ్రమిస్తేనే ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో తీర్చిదిద్దానని తెలిపారు. వనస్థలిపురం డివిజన్ పరిధిలో గుంటి జంగయ్య కాలనీ నుంచి రైతుబజార్ వరకు బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. 15 ఏళ్ల కిందట చేసిన పార్కులను బీఆర్ఎస్ హయాంలోనే మళ్లీ గుర్తించి వాటిని అత్యాధునికంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లిన విద్యార్థులు, ఇతరులు నాలుగైదు ఏండ్లకు తిరిగి వచ్చి చూడగా గుర్తు పట్టలేని విధంగా ఎల్బీనగర్ రూపురేఖలు పూర్తిగా మార్చివేశామని తెలిపారు.
రూ.658 కోట్ల నిధులతో ఎల్బీనగర్లో ఫ్లైఓవర్లు, బ్రిడ్జీలు నిర్మాణం చేసి అందుబాటులోకి తీసుకొచ్చామని, మరో నాలుగు నెలల్లో బైరామల్గూడ వద్ద మల్టీలెవల్ వంతెన నిర్మాణ పనులు పూర్తై అందుబాటులోకి వస్తుందని తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధి కోసమే పార్టీని మారాను తప్ప ఎలాంటి స్వార్థ ప్రయోజనాల కోసం కాదన్నారు. తాను ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాల మేరకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి ఎల్బీనగర్ నియోజకవర్గంలో రిజిస్ట్రేషన్ల సమస్య, ప్రాపర్టీ టాక్స్ తగ్గింపు, కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ తరలింపు, అదే స్థానంలో టిమ్స్ ఆస్పత్రి నిర్మాణం, చెరువు ఆధునీకరణ, ఆటోనగర్ డంపింగ్ యార్డు సుందరీకరణ వంటి అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు.
ఎల్బీనగర్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా 118 జీఓను తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరించామన్నారు. మూసీ నదిపై దాదాపు 15 బ్రిడ్జీలు నిర్మించనున్నామని, ప్రపంచంలోనే అద్భుతమైన బ్రిడ్జీలను ఎంచుకుని వాటి మాదిరిగా నిర్మించనున్నామన్నారు. ఈ సందర్భంగా చింతల రవికుమార్ గుప్తా ఆధ్వర్యంలో దాదాపు 150 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కుంట్లూరు వెంకటేశ్ గౌడ్, ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ అమరవాది లక్ష్మీనారాయణ, మదర్ డెయిరీ సంస్థ మాజీ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి, బీసీ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూరెళ్ల వేములయ్యగౌడ్, మాజీ కార్పొరేటర్లు జిట్ట రాజశేఖర్రెడ్డి, గజ్జెల మధుసూదన్రెడ్డి, బీఆర్ఎస్ వనస్థలిపురం డివిజన్ మాజీ అధ్యక్షుడు గడ్డం మల్లేశం గౌడ్, మహిళా నాయకులు మమత, రాజేశ్వరి, వెన్నెల, మధు, నర్సింహారావు, రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.