మన్సూరాబాద్, మార్చి 10: భిక్షాటన చేసుకుంటూ.. జీవనాన్ని కొనసాగిస్తున్న ఓ మహిళ రాచకొండ పోలీసు కమిషనరేట్ క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలో దారుణ హత్యకు గురైంది. ఆమెతో పాటు భిక్షాటన చేసుకునే వ్యక్తే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రాచకొండ పోలీసు కమిషనరేట్ క్యాంపు కార్యాలయం సమీపంలోని ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పక్కనే ఉన్న ఈ చలాన్ కాంపౌండింగ్ బూత్ వద్ద గుర్తు తెలియని ఓ మహిళ (35) దారుణ హత్యకు గురైనట్లు ఆదివారం ఉదయం పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సదరు మహిళ అల్కాపురి చౌరస్తా నుంచి రాక్టౌన్కాలనీకి వెళ్లే మార్గంలో ప్రతిరోజూ భిక్షాటన చేసుకునే మహిళగా గుర్తించారు. మహిళను దారుణంగా కత్తితో గొంతు కోసి హత్య చేశారు. ఆ మహిళతోనే ఉండే భిక్షాటన చేసే బసంత్ ఈ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రతిరోజూ వీరిద్దరూ ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పక్కనే ఉన్న ఈ చలాన్ కాంపౌండింగ్ బూత్ వద్ద నిద్రిస్తుంటారని పోలీసుల విచారణలో తేలింది. ఆదివారం తెల్లవారు జామున ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు తెలిపారు.
హత్య చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఓ వ్యక్తి ఉదయం 6 గంటల సమయంలో రక్తం అంటిన మరకలతో వచ్చి.. సాయినగర్ కాలనీ రోడ్డు నం. 1 సమీపంలో ఉన్న సిల్వర్ ప్లేట్ హోటల్ వద్ద టీతాగి వెళ్లినట్లు కొందరు స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. హత్య చేసిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు డాగ్ స్కాడ్, క్లూస్ టీంను రప్పించి.. ఆధారాలను సేకరించారు. హత్య జరిగిన కొద్ది దూరంలోనే మహిళ గొంతును కోసేందుకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ఆరు టీమ్లను ఎల్బీనగర్ పోలీసులు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖాన మార్చురీకి తరలించారు.