తెలంగాణలో ఏడాదికి 50 వేల కుటుంబాలకు దళితబంధు తప్పక ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. వృత్తి పనిముట్లు కొనుగోలు కోసం అమలు చేస్తున్న లక్ష రూపాయల ఆర్థిక సాయం నిరంతర ప్రక్రియ అని, అర్హులైన ప్రతి బీసీ బిడ్డకు అందే వరకూ బీసీ బంధు పథకం కొనసాగుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి మిగతా రాష్ట్రాల కన్నా గొప్పగా నిలిచేలా అహరహం చేసిన కసరత్తుకు ఒకనాటి సిద్దిపేట వెతలే ఊతమిచ్చాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సిద్దిపేటలో మంగళవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆ ప్రాంతంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సిద్దిపేటలో ఎన్నోఏళ్లుగా తనకు ఎదురైన అనుభవాలే ప్రేరణగా నిలిచాయని చెప్పారు. ఒక నాడు మంచినీళ్లు లేని, తాగునీళ్లు లేని సిద్దిపేటలో బంగారం లాంటి భూములున్నా పంటలు పండించుకోవడానికి నీళ్లులేని ప్రాంతాన్ని నేడు అత్యంత సుందరంగా తీర్చిదిద్దుకున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పై సీఎం ప్రశంసల జల్లు కురిపించారు. మంత్రి అయినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి ఒక్క విషయంలో, ప్రతి కార్యక్రమాన్ని సిద్దిపేటకు తీసుకొచ్చేందుకు హరీశ్రావు అద్భుతమైన కృషి చేస్తున్నాడని కొనియాడారు.