సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ): ఇంట్లో నిద్రిస్తున్న గర్భిణిని కత్తితో బెదిరించి రూ.10లక్షలు అపహరించుకెళ్లిన దుండగుడిని ఎట్టకేలకు జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.9.5లక్షల నగదుతోపాటు నేరానికి ఉపయోగించిన కత్తి, మాస్క్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్లోని నగర పోలీసు కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీసు కమిషనర్ సీవీ.ఆనంద్ కేసు పూర్వాపరాలను వెల్లడించారు. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్కు చెందిన పటేల్ మోతీరామ్ రాజేశ్ యాదవ్(26) మాదాపూర్ డెల్ కంపెనీలో కస్టమర్ సర్వీస్ స్పెషలిస్ట్. వ్యసనాలకు అలవాటు పడిన మోతీరామ్ రాజేశ్.. సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు సంపన్న వర్గాలు నివాసముండే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఒంటరి మహిళలు ఉండే ఇళ్లను గమనించడం మొదలు పెట్టాడు.
ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ రోడ్నంబర్ 52లో గర్భవతి అయిన నవ్య ఇంటి వద్ద ఈనెల 11న రెక్కీ నిర్వహించి, స్థానిక స్థితిగతులను తెలుసుకున్నాడు. 12న తెల్లవారుజామున 4 గంటలకు నవ్య ఇంటిలోకి అక్కడున్న నిచ్చెన సహాయంతో చొరబడ్డాడు. సీసీ టీవీల్లో కనిపించకుండా ముఖానికి మాస్క్, ఫింగర్ ప్రింట్స్ పడకుండా చేతులకు గ్లౌజ్లు ధరించడంతోపాటు సెల్ఫోన్ సిగ్నల్స్ లభించకుండా ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేయడం వంటి అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నాడు. నవ్య బెడ్రూమ్లోకి చొరబడ్డాడు. ఈ క్రమంలో దాదాపు ఆరున్నర గంటలపాటు గర్భవతి, ఆమె అమ్మమను తీవ్ర భయాందోళనకు గురిచేసిన నిందితుడు రూ.10లక్షలతో ఉదయం 10.30 గంటలకు అక్కడి నుంచి ఓలా క్యాబ్లో ఉడాయించాడు. అయితే తన సెల్తో క్యాబ్ బుక్ చేస్తే ఆధారాలు లభిస్తాయని జాగ్రత్తపడిన నిందితుడు బాధితురాలి ఫోన్తోనే షాద్నగర్ వరకు క్యాబ్ బుక్ చేయించుకున్నాడు. దాదాపు గంటన్నర తరువాత షాక్ నుంచి తేరుకున్న బాధితులు స్థానికుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీపీ సీవీ.ఆనంద్ ఆదేశాల మేరకు 6 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. క్లూస్టీమ్స్, సీసీఎస్, ఐటీ సెల్, టాస్క్ఫోర్స్ పోలీసులు సైతం దర్యాప్తు ముమ్మరం చేశారు.
బంజారాహిల్స్ టు షాద్నగర్..
నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు 20 రోజులు కష్టపడాల్సి వచ్చిందని సీపీ వివరించారు. ఇందులో భాగంగా బంజారాహిల్స్లో ఘటన జరిగిన ప్రదేశం నుంచి షాద్నగర్ వరకు ఉన్న 1200 సీసీ కెమెరాలను పరిశీలించారు. అంతేకాకుండా అనుమానితుల ముఖ కవలికలు, దుస్తులు, రంగులను సైతం విశ్లేషించినట్లు తెలిపారు. కాల్ రికార్డ్స్తో పాటు 360డిగ్రీల కోణంలో దర్యాప్తు జరుపగా 29 సాయంత్రం విశ్వసనీయ సమాచారం మేరకు జూబ్లీహిల్స్ డీఐ బి.శ్రీనివాస్ తన బృందంతో కలిసి కీసరలోని యాదగిరిపల్లి ప్రాంతంలో నిందితుడిని పట్టుకుని జూబ్లీహిల్స్ పీఎస్కు తరలించినట్లు తెలిపారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించడంతో అతడిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి రూ.9.5లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్, బంజారాహిల్స్ ఏసీపీ చల్లా శ్రీధర్ పర్యవేక్షణలో కేసును ఛేదించిన జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాజశేఖర్రెడ్డి, డీఐ బి.శ్రీనివాస్తో పాటు క్రైమ్ బృందాన్ని ఈ సందర్భంగా సీపీ సీవీ.ఆనంద్ అభినందించి, వారికి రివార్డులు అందజేశారు.