ఖైరతాబాద్, మే 15 : ఖైరతాబాద్ డబుల్ గృహాల అర్హులైన లబ్ధిదారుల ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. తమకు రావాల్సిన ఇండ్లను ఎమ్మెల్యే దానం నాగేందర్ తన అనుచరులకు కేటాయించారంటూ.. ఆరోపిస్తూ శుక్రవారం ఖైరతాబాద్ ఇందిరానగర్ డబుల్ బెడ్రూంలోని పలు ఇండ్లకు తాళాలు వేసి నిరసన తెలిపారు. అంతటితో ఆగకుండా తమకు అన్యాయం జరిగిందంటూ.. ఖైరతాబాద్ పోలీసులను ఆశ్రయించారు. ఇందిరానగర్ క్వార్టర్స్కు చెందిన తమ పాత ఇంటి పట్టాలను పోలీస్ స్టేషన్ వద్ద ప్రదర్శించి, ప్రభుత్వం, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇక్కడే పుట్టి పెరిగిన తమకు కాదని, ఎమ్మెల్యే తన అనుచరులకు కేటాయించుకున్నారని ధ్వజమెత్తారు. రెండు సంవత్సరాలుగా ఎమ్మెల్యే దానం నాగేందర్, తహసీల్దార్, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని లబ్ధిదారులు శ్రీలత, సోమయ్య, సంధ్య వాపోయారు. అయినా తమకు న్యాయం జరుగలేదని, ఖైరతాబాద్ ఎమ్మెల్యే తీరని అన్యాయం చేశారని దుయ్యబట్టారు. రోజు వారీ కూలీ పనులు చేసుకొని జీవించే తమకు ఇవ్వకుండా లక్షలు, కోట్లకు పడగలెత్తిన వారికి కేటాయించారని ఆరోపించారు. డబుల్ గృహాలు పొందిన ఆ ఆరుగురి ఆస్తులు, జీవన స్థితిగతులపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తమ ఇండ్లను తమకు అప్పగించే వరకు న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఐఏఎస్ అటెండర్కు డబుల్ గృహం?
నిరుపేదలు, దారిద్య్ర రేఖకు దిగువనున్న ఇండ్లు లేని వారికి కేటాయించాల్సిన డబుల్ బెడ్రూం గృహాలు ప్రభుత్వ ఉద్యోగులకు సైతం అందజేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా, ఖైరతాబాద్ డబుల్ బెడ్రూం గృహాల్లో ప్రభుత్వ ఉద్యోగం చేసే వారికి కేటాయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అందులో ఓ ఐఏఎస్ అధికారి అటెండర్కు ఇంటిని అప్పజెప్పినట్లు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. 210 ఇండ్లకు గాను ఇప్పటికే 202 గృహాలను లబ్ధిదారులకు అందజేయగా, మిగిలిన ఎనిమిది ఇండ్లను దానం అనుచరులకు కేటాయించినట్లు చెబుతున్న 401, 310, 408, 504, 507 నంబర్ల గృహాలను ఇప్పటికే వారి వారికి అప్పజెప్పగా, తాజాగా ఓ ఐఏఎస్ అధికారి అటెండర్కు ఫ్లాట్ నం. 510 కేటాయించినట్లు అర్హులైన లబ్ధిదారులు ఆరోపించారు. అయితే సదరు అధికారికి సంబంధించిన అటెండర్కు ఎలా కేటాయించారు..? ఏ ప్రాతిపదికన ఇచ్చారో అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే విషయం బయటకు పొక్కడంతో ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు, ప్రభుత్వం విచారణ జరిపించాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు.