బడంగ్పేట/కందుకూరు, ఆగస్టు 1 : అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం మండల అభివృద్ధి పనులపై మండల అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులతో మీర్పేట్ పరిధిలోని ఎస్వైఆర్ గార్డెన్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ, నియోజకవరాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ కందుకూరు వరకు మెట్రో మంజూరు ప్రకటన చేయడంతో ప్రజలు ఆనందపడుతున్నట్లు వివరించారు. పల్లె ప్రగతి ద్వారా పల్లెలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వివరించారు. మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పేదలకు గ్రామాల్లో ఇండ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు చెప్పారు.
గ్రామాల్లో గ్రంథాలయాల ఏర్పాటు చేసుకోవాలని అందుకోసం గ్రంథాలయ సంస్థ నెలకు రూ, 3వేలు. మెయింటేన్స్కు రూ,10వేల పుస్తకాలను ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రతి పాఠశాలలో రీడింగ్ రూంలు ఉన్నాయని వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవడానికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు. బీసీ రుణాలు, గృహలక్ష్మి, దళిత బంధు లాంటి పథకాలు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. గ్రామానికి రూ.15లక్షల సీఎం ఇచ్చిన మాట ప్రకారం మంజూరు చేస్తున్నారని ఆ నిధులతో ప్రజల కనీస అవసరాలను గుర్తించి తీర్చాలని కోరారు. చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకవెళ్లాలని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వెళ్లాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, వైస్ చైర్మన్ గోపిరెడ్డి విజేందర్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, కృష్ణారాంభూపాల్రెడ్డి. ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి. మహిళా అద్యక్షురాలు తాండ్ర ఇందిరమ్మ దేవేందర్, సర్పంచ్ల ఫోరం అద్యక్షుడు శ్రీనివాసచారి, తహసీల్దారు మహేందర్రెడ్డి, ఎంపీడీవో వెంకట్రాములు, విద్యుత్ ఏఈ రమేష్గౌడ్, మండల పరిధిలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.