హైదరాబాద్ : దేశ స్వాతంత్య్ర చరిత్రను విద్యార్థులకు తెలియజెప్పాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వజ్రోత్సవాలలో భాగంగా గాంధీ చిత్ర ప్రదర్శనకు సహకరించిన తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, డిజిటల్ సర్వీస్ ప్రతినిధులను మాసబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో మంత్రి వారిని సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భారత వజ్రోత్సవాలు జరుపుతున్న శుభ సందర్భంలో సీఎం కేసీఆర్ 15 రోజుల వేడుకలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల చరిత్ర తెలువాలని సీఎం కేసీఆర్ ఆలోచన చేశారు. గాంధీ సినిమాను ఇప్పటి పిల్లలకు చూపించాలని నిర్ణయం తీసుకున్నారు.
552 సినిమా థియేటర్లలో గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించామన్నారు. 22 లక్షల 57 వేల మంది ఈ సినిమాను వీక్షించారని మంత్రి తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో ఇంత పెద్ద పోగ్రాం విజయవంతం అయింది. అన్ని జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు సినిమాను వీక్షించారు.
ఇంత పెద్ద విజయం అందించినందుకు సినిమా ఇండస్ట్రీ వారికి ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మచలం, సీఎస్ సోమేశ్ కుమార్ దతదితరులు ఉన్నారు.