బంజారాహిల్స్, మార్చి 10: రోడ్డు ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బోరబండ ప్రాంతానికి చెందిన భరణి సాయిలోకేశ్ (15) స్థానిక ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 18 నుంచి పరీక్షలు ఉండటంతో అతడు ఇంటి వద్దే ఉండి చదువుకుంటున్నాడు. ఆదివారం ఉదయం ఆరు గంటల సమయంలో సరదాగా స్నేహితులతో కలిసి రెండు బైక్లపై కేబీఆర్ పార్క్కు బయలుదేరారు.
బంజారాహిల్స్ రోడ్ నం. 3, టీవీ 9 చౌరస్తా నుంచి కేబీఆర్ పార్కు వైపు వెళ్తూ.. సిగ్నల్ వద్ద బైక్ అదుపుతప్పింది. దీంతో బైక్ నడిపిస్తున్న లోకేశ్ ఎగిరి కరెంట్ స్తంభానికి ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. స్నేహితులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అక్కడికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.