సనత్ నగర్ : సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుండడంతో రాష్ట్రంలోని యాదాద్రి, బాసర, వేములవాడ, కొమురవెల్లి, కొండగట్టు, జోగులాంబ తదితర ఆలయాలు దివ్య క్షేత్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామిని సోమవారం మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు.దేశ చరిత్రలోనే ఆలయాల అభివృద్ధికి ఇంతగా పూనుకున్న ముఖ్యమంత్రి లేరని, సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో తెలంగాణలోని ప్రతి దేవాలయం అభివృద్ధి చెందుతున్నట్లు తెలిపారు.
యాదాద్రి దేశంలోనే నెంబర్ వన్ ఆలయంగా తీర్చిదిద్దన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని, నిర్మాణ పనులు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. దేవాలయాలకు వచ్చే భక్తుల కోసం వసతులు కల్పిస్తుండడంతో ఆలయాలు అభివృద్ధి చెందడంతో పాటు ఆదాయం సైతం పెరుగుతున్నట్లు చెప్పారు.
కొమురవెల్లి ఆలయ సమీపంలో దాసారం గుట్టపై డోనర్ స్కీంలో తాను రూ.2కోట్లతో గెస్ట్హౌస్ నిర్మించి ఆలయానికి అప్పగించనున్నట్లు తెలిపారు. పలువురు దాతలు గెస్ట్ హౌజ్లు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మల్లన్న ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి, ఆలయ ఈవో అలూరి బాలాజీ, ఎంపీపీ కీర్తన, జడ్పీటీసీ సిద్దప్ప తదితరులు ఉన్నారు.