తెలుగు యూనివర్సిటీ, డిసెంబర్ 25 : సచివాలయం స్థాయిలో తెలుగు భాష అమలు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ అభిప్రాయపడ్డారు. తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ సౌజన్యంతో తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో తెలుగు భాషోపాధ్యాయుల సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడారు. మాతృభాషను కాపాడుకునేలా పాఠశాల స్థాయిలో విద్యాశాఖ ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించుకుందామని ఉపాధ్యాయులకు తెలియజేశారు. భాషా పండితుల ప్రమోషన్ల కేసు చివరి దశకు చేరుకునే అవకాశం ఉందని తీర్పు కాపీ అందిన వెంటనే అమలు చేస్తామని ఆమె ప్రకటించారు.
తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి రమణాచారి మాట్లాడుతూ.. మాతృభాషను సుసంపన్నం చేసే భాధ్యత ఉపాధ్యాయులపై ఉందని గుర్తు చేశారు. సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ.. ప్రజల జీవన విధానంలోనే మాతృభాష బతికిఉందన్నారు. అనంతరం సదస్సు చేసిన 18 తీర్మానాల కాపీని వాకాటి కరుణకు అందజేశారు. కార్యక్రమంలో అధికార భాషా సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి, పరిషత్తు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, భాషావేత్త పారుపల్లి కోదండరామయ్య, ప్రముఖ రచయిత్రి డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డి, పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య, కోశాధికారి మంత్రి రామారావు, బైరోజు రాజశేఖర్ పాల్గొన్నారు.