చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే దానం నాగేందర్
ఖైరతాబాద్, ఏప్రిల్ 7 : ప్రజా సంక్షేమ పథకాలలో దేశానికే తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. సోమాజిగూడ డివిజన్లోని ఎంఎస్ మక్తాలో అర్హులైన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను కార్పొరేటర్ వనం సంగీత యాదవ్తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆడపిల్లల పెండ్లి కోసం ప్రభుత్వం ఈ బృహత్తరమైన పథకాన్ని తీసుకొచ్చిందని, పెండ్లీడుకు వచ్చిన ప్రతి అమ్మాయికి రూ.1,00,116 కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా ప్రభుత్వం కుటుంబ పెద్దగా అందజేస్తుందన్నారు.
వీటితో పాటు ఆసరా పింఛన్లు, రైతు, దళిత బంధు, బీమా లాంటి పథకాలు ఏ రాష్ట్రంలో లేవన్నారు. టీఆర్ఎస్ నాయకులు వనం శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఎస్కె అహ్మద్, మాజీ కార్పొరేటర్ లక్ష్మీనారాయణమ్మ, నాయకులు రామ్మూర్తి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.