హైదరాబాద్, జనవరి 5 : ఉపాధి హామీ పనుల్లో దేశంలోనే తెలంగాణ ముందు స్థానంలో నిలిచింది. రాష్ట్రానికి కేటాయించిన పనిదినాలను డిసెంబర్ చివరి నాటికే, ఇతర రాష్ర్టాల కన్నా ముందే పూర్తిచేసింది. రాబోయే 3 నెలల్లో మరో రెండు కోట్ల పని దినాలు పూర్తి చేసేందుకు సిద్ధమైంది. అందుకోసం కార్యాచరణ సిద్ధం చేసింది. రాష్ర్టానికి 2021-22 ఆర్థిక సంవత్సరంలో 13 కోట్ల ఉపాధి హామీ పని దినాలను కేటాయించగా, డిసెంబర్ చివరి నాటికే 12.92 కోట్ల పనిదినాలు(లక్ష్యంలో 99.38 శాతం) పూర్తయ్యాయి. మరో రెండు కోట్ల పని దినాలకు కేంద్ర ప్రభుత్వ ఆమోదాన్ని తీసుకొన్నది. రాష్ట్ర ప్రభుత్వం 2020-21లో లక్ష్యానికి మించి 15.79 కోట్ల పనిదినాలను కల్పించింది. 2021-22లో డిసెంబర్ వరకు 13 కోట్ల లక్ష్యానికి గాను 12.29 కోట్ల పనిదినాలు కల్పించగా, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో ఎక్కువ పనిదినాలను కల్పించింది. మరోవైపు 46.33 లక్షల మంది కూలీలకు రూ.2,215 కోట్ల కూలి చెల్లించింది. గ్రామాల్లో జీవనోపాధి, మౌలిక వసతుల కల్పనకు రూ.968 కోట్లు మెటీరియల్ రూపంలో చెల్లించింది.
అత్యధికంగా సంగారెడ్డిలో
రాష్ట్రంలో ప్రస్తుతం సగటున రోజుకు దాదాపు లక్షకుపైగా ఉపాధి హామీ కూలీలు పనులు చేస్తున్నారు. ప్రతి పంచాయతీలో సగటున 19 మంది కూలీలు పనిచేస్తున్నారు. ఈ నెల 1న 1.64 లక్షల మంది పనిచేశారు. ఆ రోజున అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో 13,736 మంది కూలీలు పనిచేశారు.