చార్మినార్, జూలై 5 : తెలంగాణలో ఏ మట్టిని ముట్టుకున్నా ఏ ఊరును కదిలించినా సంపద్వంతమైన చరిత్ర ఊటలా ఉబికి వస్తుందని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూ రు గౌరీశంకర్ అన్నారు. సిటీ కాలేజీలో బుధవారం నిర్వహించిన ‘మన ఊరు మన చరిత్ర’ ప్రాజెక్టు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. చరిత్రను రాయడానికి సిద్ధపడ్డవాడు చరిత్రను నిర్మిస్తాడు.. సిటీ కాలేజీ విద్యార్థులు కాకతీయుల కాలం నుంచి నేటి వరకు తెలంగాణ గ్రామీణ చరిత్రను వర్తమాన పరిస్థితుల నేపథ్యంలో తిరిగి రాయాలని సూచించారు. విద్యార్థులు చరిత్ర ఆనవాళ్లలోకి వెళ్లి పరిశీలిస్తే పాఠ్యంశాల్లో లేని అనేక విషయాలు అవగతమవుతాయన్నారు. వీర తెలంగాణ పోరాటంలో గ్రామీణ యువకుల చేతి కర్రను మార్చి ఆదిపత్య వాదులపై అలుపెరగని పోరాటం చేసిన విధానాన్ని చరిత్రగా రాయాల్సిన అవసరం ఉందన్నారు.
డిగ్రీ విద్యార్థులు అందుకునే డిగ్రీ పట్టా విలువ కంటే తమ స్వగ్రామాల గురించి రాసే చరిత్ర ఎంతో విలువైనదన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ అందించిన పిలుపును అందుకుని విద్యార్థులు చేపట్టిన రెండువేల మన ఊరు, మన చరిత్ర ప్రాజెక్టులు అందాయని, నేటి సమకాలీన తెలంగాణ చరిత్రకు ఎంతగానో ఈ ప్రాజెక్టులు ఉపయోగపడుతాయన్నారు. గంగిరెద్దులు, ఒగ్గు కథకులు లాంటి సంచార జాతుల జీవిత చరిత్రలను వారి సాంస్కృతిక విశిష్టతలను ప్రత్యేకంగా విద్యార్థులు అధ్యయనం చేయాలన్నారు. సిలబస్లో లేనిగొప్ప పాఠం,పాఠంలో లేని గొప్ప సంస్కారం, విజ్ఞానం, మన గ్రామాల్లో దాగి ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు వాటిని వెలికి తీసి లోకానికి చాటి చెప్పాలన్నారు. గ్రంథాలయాన్ని, తరగతి గదిని తగిన రీతిలో ఉపయోగించుకుంటే విద్యార్థులు శాస్త్రవేత్తలుగా, సామాజిక వేత్తలుగా ఎదుగుతారని పేర్కొన్నారు. వివిధ గ్రామాల్లో పర్యటిస్తూ అక్కడి విషయాలను స్థానికుల ద్వారా గుర్తించి ప్రాజెక్టుగా మలిచిన సిటీ కాలేజీ విద్యార్థులు మిగతా విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారని గౌరీశంకర్ ప్రశంసించారు. అనంతరం సిటీ కాలేజీ విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ బాలభాస్కర్, మన ఊరు, మన చరిత్ర జిల్లా కన్వీనర్ కోయి కోటేశ్వరరావు, కళాశాల కన్వీనర్ శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ ఎజాజ్ సుల్తానా, విప్లవ్దత్త్ శుక్లా, ఐక్యూయేసి కోఆర్డినేటర్ నీరజ, భాస్కర్, శంకర్లతోపాటు అధ్యాపకులు పాల్గొన్నారు.