హైదరాబాద్ : తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈనెల 12 వ తేదీన నిర్వహించే తెలంగాణ రన్ లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతంచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి(Chief Secretary Shanti Kumari ) కోరారు. తెలంగాణ రన్ (Telangana Run) నిర్వహణపై గురువారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. డీజీపీ అంజనీ కుమార్(DGP Anjani Kumar) తో సహా పలువురు సీనియర్ పోలీస్ అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు.
సీఎస్ మాట్లాడుతూ హైదరాబాద్ లోని బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహం సమీపంలోని మైదానం నుంచి జరిగే 2 కె, 4 కె రన్ లను ప్రధానంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ రన్లో కనీసం నాలుగు వేల మంది రన్నర్లు పాల్గొంటారని వివరించారు. నగరంలోని యువత, కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ సంస్థల ప్రతినిధులు, పోలీసులు పాల్గొంటారని వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ స్ఫూర్తిని ప్రతిబింబించేలా రన్ను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జీఏడీ కార్యదర్శి శేషాద్రి, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, అడిషనల్ డీజీ సంజయ్ కుమార్ జైన్, ఐజీ రమేష్ రెడ్డి, అడిషనల్ సీపీ లు విక్రమ్ సింగ్ మాన్, సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు.