సాఫీగా వ్యాపారాలు, చేతినిండా పని
ఏడేండ్లుగా ఇన్వర్టర్లు, జనరేటర్లకు గుడ్ బై
ఏడేండ్లలో కరెంటు కోతలే లేవని సంబురం
పక్క రాష్ర్టాల్లో అంధకారం.. మనవద్ద వెలుగులమయం
లక్షలు పోసి జనరేటర్లు కొన్నాం.. రూ. వేలల్లో మెయింటెనెన్స్
అప్పటి డీజిల్ ఖర్చులే.. ఇప్పుడు కరెంటు బిల్లులు
నిరంతర కరెంటు సరఫరాపై సంతోషంగా వ్యాపార వర్గాలు
సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితోనే 24 గంటల కరెంటు సరఫరా
సిటీ నెట్వర్క్, మే 4 (నమస్తే తెలంగాణ): కిరాణా దుకాణంలో విసన కర్రతో వ్యాపారి.. కరెంటు వచ్చినంక జిరాక్స్ తీస్తానంటూ ఫైళ్లకు ఫైళ్లు మూటగడుతున్న యజమాని… కరెంటు లేక కస్టమర్లు వెనుదిరిగి పోవడంతో హెయిర్ డ్రెస్సింగ్ దుకాణం ఎదుట పిచ్చాపాటీ మాట్లాడుతున్న నాయీ బ్రాహ్మణ సోదరుడు… ఎప్పుడు వస్తుందో తెలియని కరెంటు కోసం బల్బు దిక్కు చూస్తూ పడిగాపులు కాస్తున్న వెల్డింగ్ షాపు ఓనర్… ఇలా ఒకటేమిటి… చిన్నపాటి కిల్లీ కొట్టు మొదలు భారీ షాపింగ్ మాల్ వరకు నగరంలో ఎక్కడ చూసినా ఎండాకాలంలో కనిపించే దృశ్యాలివి. రోజూ ఆరేడు గంటల ప్రకటిత కరెంటు కోతలకు తోడు… అడపాదడపా పత్తా లేకుండా పోయే కరెంటుతో వ్యాపారాలన్నీ కుదేలయ్యేవి. కానీ గత ఏడేండ్లుగా… అందునా దేశంలోని అనేక రాష్ర్టాలు కరెంటు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఇంతటి క్లిష్ట సమయంలోనూ నగరంలో ఏ ఒక్క వ్యాపారి కరెంటు కోసం క్షణం పాటు వేచి చూడాల్సిన పరిస్థితి లేదు. అసలు కరెంటు కోతలంటేనే వ్యాపార వర్గాలు మరిచిపోయాయి.
24 గంటల పాటు నాణ్యమైన కరెంటు సరఫరాతో సాఫీగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్న వీరంతా తమతో పాటు పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇలా… గ్రేటర్వ్యాప్తంగా లక్షల్లో కుటుంబాలు కరెంటు కోతల్లాంటి చీకూ చింత లేకుండా రెండు చేతులా సంపాదించుకొని కుటుంబంతో హాయిగా ఉంటున్నారు. అంతేకాదు… తెలంగాణ ఏర్పడితే అంధకారమేనన్న శాపనార్థాలను సవాలుగా తీసుకొని తెలంగాణ విద్యుత్ రంగాన్ని దేశంలోనే ఎక్కడాలేని విధంగా మలిచిన సీఎం కేసీఆర్కు తామంతా రుణపడి ఉంటామని వ్యాపారవర్గాల లోకం సంతోషం వ్యక్తం చేస్తుంది. మరి… వారి సంతోషాల్ని వారి మాటాల్లోనే చూద్దాం.
జనరేటర్ చింత లేనే లేదు..
25 ఏండ్ల నుంచి నేను మోటారు వైండింగ్ చేస్తున్న. రూ.10లక్షల నగదుతో వ్యాపారాన్ని ప్రారంభించాను. నిరంతరం విద్యుత్ ఉంటేనే వ్యాపారం సాగుతుంది. ఏడేండ్లుగా వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు,నష్టాలు లేవు. ఏడేళ్ల క్రితం కరెంటు కోతలతో తీవ్రంగా నష్టపోయాను. చుట్టుపక్కల వ్యాపారులు డీజిల్ జనరేటర్ కొనుగోలు చేశారు. ఇపుడు నిరంతర విద్యుత్తో జనరరేటర్ చింత లేనే లేదు. ఇదంతా సీఎం కేసీఆర్తోనే సాధ్యమైంది.
– అనంతరెడ్డి, మోటారు వైయిండింగ్ దుకాణ యజమాని
కరెంటు కష్టాలు తీరాయి
టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పుష్కలంగా కరెంటు అందుతుంది. ఇంతకు ముందు వర్క్ షాపులో కరెంటు లేక పని సక్రమంగా జరగక లేబర్ జీతాలు ఇవ్వాలంటే సొంత డబ్బులు చెల్లించేవాళ్లం. కరెంటు సరఫరాలేక వర్క్షాపులన్నీ దీవాళ తీసే క్రమంలో సీఎం కేసీఆర్ కరెంటు అందించి అందుకున్నాడు. 24 గంటల పాటు కరెంటు అందించడంతో ఇష్ట వచ్చినప్పుడు బేరింగ్ వర్క్ చేసుకుంటున్నాం.
– సీహెచ్. వెంకటేశ్వర్లు, వాసవి ఇంజినీరింగ్ వర్క్స్, మౌలాలి
ఏటా 4 లక్షలు ఆదా అవుతున్నయి
నిరంతర విద్యుత్ సరఫరాతో సమస్యలు తొలగిపోయాయి. నిర్వహణ వ్యయం చాలా వరకు తగ్గింది. యేటా దాదాపు నాలుగు లక్షల వరకు డబ్బులు ఆదా అవుతున్నాయి. ఖర్చు తగ్గడంతో వినియోగదారులకు సరసమైన ధరలకే సరకులు విక్రయిస్తున్నాము. ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా మెరుగ్గా ఉంది. రానున్న రోజుల్లో మరిన్ని షాపింగ్ మాల్స్ తెరిచే యోచనలో ఉన్నాం.
– రవికుమార్, ఉషోదయ షాపింగ్మాల్ నిర్వాహకుడు, బోడుప్పల్
ఏడేండ్లుగా కరెంటు కోతలు చూడలె
ఏడేండ్లుగా కరెంటు కోతలు ఎన్నడూ మాకు ఎదురుకాలేదు. గతంలో మంచి గిరాఖీ ఉండే మధ్యాహ్నం సమయంలో కరెంటు కోతలు ఉండేవి. వ్యాపారాలు పూర్తిగా క్షీణించిపోయేవి. టీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తుండటంతో మా వ్యాపారాలు మంచిగ నడుస్తున్నాయి. ఈ వేసవికాలంలో ఎండలు ఇంత తీవ్రంగా ఉండటంతో రోజుకు మూడు వందల గ్లాసుల జ్యూస్ అమ్మకం జరుగుతుంది. కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్నాం.
– సునీల్, జ్యూస్ వ్యాపారి
ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాం
సమైక్య పాలనలో కరెంట్ కోతలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. పగలు, రాత్రి అనే తేడా లేకుండా కరెంటు కోతలు విధించేవారు. దీంతో కరెంట్ మోటారుతో కుట్టు మిషన్పై బట్టలు కుట్టేందుకు తీవ్రంగా ఇబ్బందులు పడే వాళ్లం. కానీ ఇప్పడు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాతో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాం.
– రచ్చ శ్రీనివాస్, టైలర్, గోల్నాక
కేసీఆర్ సార్ గ్రేట్..
మాది ఫొటోస్టూడియో. కరెంటు లేకపోతే ఏ పనీ చేయలేం. పదిహేను సంవత్సరాలుగా ఈ వృత్తిలో ఉన్న. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక కరెంటు లేక పనులు ఆగింది లేదు. గతంలో కరెంటు లేక కస్టమర్లు మళ్లిపోయెటోళ్లు. ఇప్పుడు ఆ బాధలేదు. ఇప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా ఇయ్యడంతో అభ్యర్థులు ఫొటోల కోసం వస్తున్నరు. మంచి గిరాకీ ఉంది. అందుకే కేసీఆర్ సార్ గ్రేట్.
– అజ్జు కిషన్, ఫొటోగ్రాఫర్, నాగోలు
కరెంటు ఉంటేనే వెల్డింగ్ పనులు..
వెల్డింగ్ పనులలో కరెంటు చాలా ముఖ్యం నిరంతర విద్యుత్ ఉండడం వల్లే కష్టమర్లకు సమయానికి వారు ఇచ్చిన ఆర్డర్లు పూర్తి చేయగలుగుతున్నాం.వెల్డింగ్ పనులు సుమారు 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. గతంలో కరెంటు లేకపోయేసరికి కరెంటు వచ్చాక అర్థరాత్రి వరకు ఆర్డర్ల పనులు చేస్తుండేది. ఇప్పుడు కరెంటు 24 గంటలు ఉండడం వలన రాత్రి పనులు చేయకుండా సాయంత్రం వరకు పనులు ముగిస్తున్నాం.
– శంకర్, విజయలక్ష్మి వెల్డింగ్ వర్క్స్, మధుబన్ కాలనీ
కరెంట్ కోసం జాగారం చేసేటోళ్లం
గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వందకు వంద శాతం 24 గంటల కరెంటు ఇస్తున్నది. గతంలో కరెంటు కోసం జాగారం చేసేటోళ్లం. విసన కర్రలతో ఊపుకునే వాళ్ళం. వేలకు వేలు పెట్టి ఇన్వర్టర్లు కొనుకునే వాళ్లం. ఒక్క ఇన్వర్టర్కు రూ.15వేలు ఖర్చు అయ్యేది. దీంతో విద్యుత్ బిల్లులు ఎక్కువగా వచ్చేవి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పరిస్థితి లేదు.
– పవన్ కుమార్ కిరాణం షాపు యజమాని
కలలో కూడా అనుకోలేదు..
సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లో 20 సంవత్సరాలుగా డెంటల్ క్లీనిక్ నడుపుతున్నాను. క్లీనిక్కు వచ్చే పేషంట్స్ సాయంత్రం, పగలు అనే తేడా లేకుండా కరెంటు లేక ఇబ్బందులు పడేవారు. ఎంత జనరేటర్ పెట్టినా అంతంత మాత్రంగానే పని చేసేది. ముఖ్యమంత్రి కేసీఆర్ కరెంట్ కష్టాలకు చెక్ పెట్టారు. ఇది కనీవిని ఎరుగని సత్యం.. ఇలా కరంటు నిరంతరం ఇస్తారని కలలో కూడా అనుకోలేదు.
– వి సత్యం, దంత వైద్యులు, రెజిమెంటల్బజార్
రోజూ పని దొరుకుతుంది..
తెలంగాణ రాష్టం ఏర్పడక ముందు ఎండ కాలం వచ్చిందంటే చాలు కరెంటు కోతలు మొదలయ్యేవి. ఉదయ 9 గంటల నుంచి సాయంత్రం వరకు కరెంటు కోతలు ఉండేవి. దాంతో పనులు చేయాలంటే ఇబ్బందిగాఉండేది. నేడు ఆ పరిస్థితులు లేవు. నివాసాలతో పాటు కార్ఖానాలకు కూడా 24 గంటలు విద్యుత్ను సరఫరా చేస్తున్నారు. కరెంటు కోతలు లేకపోవడంతో ప్రతి రోజూ వడ్రంగి పనులు చేసుకుంటున్నాం.
– రవిచారి, కార్పెంటర్ అత్తాపూర్
పది మందికి ఉపాధి ఇస్తున్న
ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కోతలతో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడేవాళ్లం. వేసవి వచ్చిదంటే కుటుంబం గడవడమే కష్టంగా ఉండేది. మాకు పని లేకపోవడమే కాకుండా మా దగ్గర పని చేసే వాళ్లకు పని లేకుండా ఉండేది. తెలంగాణలో సీఎం కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తున్నారు. దీంతో ఏ ఇబ్బంది లేకుండా పనులు చేసుకోగలుగుతున్నాం. పది మందికి ఉపాధి కల్పిస్తున్నాం.ఇంటోల గడవటం కష్టంగా, ఆర్థికంగా ఇబ్బందుల ఉండేవి. ఇద్దరు పిల్లలు, సంపార గడక నానా ఇబది నిరంతర కరెంట్తో ఆర్థిక ఇబ్బంది 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాం.
– భాస్కరాచారి ఉడ్ వర్క్ వ్యాపారం, జవహర్నగర్
కరెంటు ఉంటె కష్టాలు పోయినట్లే..
మాది కారు రిపేరు షాపు. వెల్డింగ్ పనులు ఎక్కువ చేస్త. కరెంటు ఉంటే చాలు.. మాకు పనులు మంచిగ నడుస్తయి. గతంల రెండు గంటలు పని చేస్తే.. మూడు గంటలు కరెంటు లేక ఉత్తగన కూర్చునెటోళ్లం. తెలంగాణ వచ్చినంక 24 గంటల కరెంటు ఉంటుంది. కరెంటు మంచిగ ఉంటె మాకు కష్టాలు లేనట్లే. నెలకు అద్దె, అన్నీ పోను రూ.20వేల వరకు మిగులుతున్నయి.
– ఆంజనేయులు, కారు రిపేర్ దుకాణ యజమాని, సులేమాన్ నగర్
జిరాక్స్ మిషన్కు మంచి గిరాకీ
కరెంటు ప్రతి నిత్యం ఉండడంతో జిరాక్స్ గిరాకీ పెరిగింది. 20సంవత్సరాల నుండి కాటేదాన్ చౌరాస్తాలో జిరాక్స్ సెంటర్ను నడిపిస్తున్నాము. స్టేషనరీలో కన్నా జిరాక్స్లో కొంత సంపాధించుకుంటున్నాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వారంలో రెండు రోజులు కరెంటు లేకుండా ఉన్న రోజులు చూశాము. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక గంట కరెంటు పోయిన రోజు లేదు.చిరు వ్యాపారులకు నిరంతరం కరెంటును ఇచ్చి వ్యాపారం నడిచే విధంగా చేస్తున్న ప్రభుత్వాలే మాకు కావాలి.
– పాము అనీత-శ్రీలక్ష్మి స్టేషనరీ అండ్ జిరాక్స్ సెంటర్ -గణేశ్నగర్
ప్రతి దినం పని దొరుకుతుంది
మేము 15 సంవత్సరాల నుంచి ఇంజినీరింగ్ వర్క్స్ను నడిపిస్తున్నాను. గతంలో కరెంటు కోతలతో పని సరిగా దొరికేది కాదు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక నిత్యం పనిలో నిమగ్నమవుతున్నాము. జనరేటర్లకు లక్షలు వెచ్చించి వాటిలో డీజిల్ పోసి నడిపించేది. ఇప్పుడు జనరేటర్తో పాటు డీజిల్ ఖర్చు లేకుండా 24 గంటలు కరెంటు ఉండడంతో నైట్ షిఫ్టులు పని చేస్తున్నాం. నిత్యం కరెంటు ఇచ్చి ప్రజల కష్టాలనుండి దూరం చేసిన కేసీఆర్కు మేము రుణపడి ఉంటాం.
– మాజిత్, ఏవన్ ఇంజినీరింగ్ వర్క్స్ యాజమాని, కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియా
థ్యాంక్స్ టు సీఎం కేసీఆర్
తెలంగాణ వస్తే కరెంటు కోతలుంటయని భయపెట్టిర్రు. కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా 24గంటల కరెంటును రాష్ట ప్రభుత్వం సరఫరా చేస్తుంది. దీంతో వ్యాపారం బాగా సాగుతుంది. ప్రస్తుతం కరెంటు కోతలు లేకపోవడంతో పెద్ద మొత్తంలో వస్తువులను ఉత్పత్తి చేసి అనుకున్నదాని కంటే ముందుగానే సప్లయ్ చేస్తున్నాం. థ్యాంక్సు టూ సీఎం కేసీఆర్.
– విజయ్ కుమార్, ప్లంబర్ సామాను సప్లయర్, హైదర్గూడ
ఏడాదికి రెండు లక్షలు మిగులుతున్నయి
గతంల ఎండాకాలం వచ్చిందంటె జనరేటర్ మీదనే ఆధారపడేవాళ్లం. ఎండాకాలం పెండ్లిళ్లు, శుభకార్యాల సీజన్. కరెంటు లేకపోతే ఫంక్షన్లు జరగవు. అందుకే నెలకు 10-15వేల వరకు కేవలం డీజిల్కే ఖర్చయ్యేది. తెలంగాణ వచ్చినంక కరెంటు పోవడమనేదే లేదు. ఏదో సాంకేతికంగా సమస్య వస్తే తప్ప… జనరేటర్తో పనే లేదు. అట్ల ఏడాదికి రూ. 2 లక్షలకు పైనే డీజిల్ ఖర్చులు మిగులుతున్నయి.
– ఏ వెంకటేశ్గౌడ్, ఏఎన్జీ గార్డెన్స్ యజమాని
ఒక్క రోజు డీజిల్ ఖర్చుతో నెల కరెంటు బిల్లు..
నాది పూజా అండ్ కొబ్బరికాయల హోల్సేల్ మర్చంట్ మోండా మార్కెట్ పదహారేండ్లుగా నిర్వహిస్తున్నాను. గతంలో ఇన్వర్టర్స్, లేదా చిన్న జనరేటర్స్ వినియోగించే వాళ్లం. దానికి డీజిల్, కిరోసిన్ వాడే వాళ్లం… దానికే సుమారు రూ వెయ్యికి పైగ ఖర్చు అవుతుండేది. దీంతో పాటు కరంటు బిల్లు కూడా ఉంటుండేది. ఇప్పుడా ఆ పరిస్థితి లేదు. అదే వెయ్యి పదిహేను వందల్లో కరంటు బిల్లు చెల్లిస్తున్నాం.
– రాజు, కొబ్బరి కాయలు, పూజాస్టోర్, మోండా మార్కెట్
వ్యాపారం సాఫీగా సాగుతున్నది
తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 24 గంటల కరెంటు సరఫరాతో మా వ్యాపారాలు సాఫీగా సాగుతున్నాయి. 12 సంవత్సరాలుగా వ్యాపారం నిర్వహిస్తున్నాను. మా దుకాణంలో రిఫ్రిజిరేటర్లు, కూలర్లు, గ్యాస్ స్టౌ రిపేర్ పనులు కొనసాగుతాయి. గత ప్రభుత్వ హయాంలో ఉదయం, సాయంత్రం వేళల్లో కరెంటు కోతలతో ఇబ్బందులు పడేవాళ్లం. వ్యాపారంలో నష్టం వాటిల్లేది. నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– మహ్మద్ రఫీక్, రాయల్ ఎంటర్ప్రైజస్, హయత్నగర్
జనరేటర్ ఆన్ చేసేదే లేదు..
నిరంతర విద్యుత్ సరఫరాతో వైద్యశాలలో ఖర్చులు.. కష్టాలు తగ్గాయి. గతంలో కరెంటు ఎప్పుడు పోతుందో.. ఎప్పుడు వస్తుందో.. తెలిసేది కాదు. వైద్యశాలల్లో అత్యవసర పరిస్థితుల దృష్ట్యా నిరంతరం కరెంటు సరఫరా అవసరం. దీని కోసం వైద్యశాలలో రూ.20 లక్షలకు పైగా ఖర్చుపెట్టి జనరేటర్ను ఏర్పాటు చేసుకునేవాళ్లం. కరెంటు బిల్లులతో పాటు అదనంగా జనరేటర్ మెయింటెనెన్స్ భారం 40 వేల వరకు భరించాల్సి వచ్చేది. వేసవికాలం వచ్చిందంటే చాలు జనరేటర్నే నమ్ముకునే వాళ్లం. ఏడేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం నిరంతరాయంగా విద్యుత్ను సరఫరా చేస్తుండడం వల్ల వైద్యశాలలకు ఎంతో మేలు జరుగుతుంది.
–డాక్టర్ భరత్కుమార్, సంఖ్యా వైద్యశాల, కేపీహెచ్బీ కాలనీ
సర్కార్కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
మా కంపెనీలో గతంలో 15 మంది పని చేసేవారు. ఇప్పుడు 35 మంది వరకు పని చేస్తున్నారు. మేం అన్ని వస్తువుల మీద, వస్త్రాల మీద డిజైనింగ్ ప్రింటింగ్ వర్క్ చేస్తాం. కరెంట్ కోతలు లేకుండా ఉండటం వల్ల మా బిజినెస్ పెరిగింది. కస్టమర్ కోరుకున్న సమయానికి డెలివరీ ఇవ్వగలుగుతున్నాం. మరో రెండు బ్రాంచీల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాం. ఎండాకాలంలో కరెంట్ నిరంతరం ఉండటం అనేది నిజంగా తెలంగాణ సర్కార్కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
– వాణి, చైర్మన్, ప్రింటింగ్ అండ్ డిజైనింగ్.
అక్కడ తొలిగించాం.. ఇక్కడ పెంచుతున్నాం
12 రాష్ర్టాల్లో కరెంట్ సమస్య ఉంది. గుజరాత్లో కూడా ఉంది. తెలంగాణలో మాత్రం విద్యుత్ సమస్య లేదు. ఇది మన అదృష్టంగా భావించాలి. మా కంపెనీ రెండో యూనిట్ను ఒక రాష్ట్రంలో ఏర్పాటు చేశాం. అక్కడ కరెంట్ సమస్య అధికంగా ఉంది. జనరేటర్స్తో పని చేయాల్సి వస్తుంది. పెరిగిన ఇంధన ధరలు కూడా కష్టతరంగానే ఉన్నాయి. అన్ని షిఫ్ట్ల్లో పని చేయించడం కుదరలేదు. నష్టం లక్షల్లో ఉంది. అందుకే కొన్ని ప్రాజెక్టులు ఆ రాష్ట్రంలో తీసుకోవడం లేదు. ఇక్కడే మరో యూనిట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాం.
– నీరజ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఏకశిల కెమికల్స్ కంపెనీ.
అప్పులు తీరి.. హాయిగా..
రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని గొల్లపల్లిలో నాకు రెండెకరాలు ఉంది. కూరగాయలు, ఆకుకూరలు పండిస్తం. ఏడేండ్ల కిందట బోరులో నీరున్నా… కరెంటు లేక దిగుబడి రాకపోయేది. అట్ల రూ. 2 లక్షల అప్పయింది. 2015 నుంచి కరెంటు మంచిగుంటుంది. ఇపుడు కూరగయాలు గుడిమల్కాపూర్ మార్కెట్ల అమ్మి అప్పు తీర్చిన. సీఎం కేసీఆర్ పుణ్యాన ఆ బాధలు లేవు. అప్పులు లేకుండా ఇంటిల్లిపాదీ హాయిగ ఉన్నం.
– ఎండీ రహీమ్ , చిరు రైతు, సులేమాన్ నగర్
ఇన్వర్టర్లకు పుల్స్టాప్ పడింది
నిరంతర విద్యుత్ను అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. గతంలో కరెంటు కోతలతో వ్యాపారాలు సాగక పోవడంతో ఇన్వర్టర్లు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు కొనసాగించేంది. దీనికి నెలకు దాదాపుగా రూ. 25 వేల నుండి 40 వేల వరకు అదనపు ఖర్చు అయ్యేది. తెలంగాణ ప్రభుత్వం నిరంతర విద్యుత్ సరఫరాతో ఇన్వర్టర్లకు పుల్స్టాప్ పడింది.
– ఎస్. రవిరాజ్, సాయికృష్ణ ఎలక్ట్రానిక్ షాపు, హయత్నగర్
కోతలతో ఇబ్బంది పడేవాళ్లం
ఇరవై ఏండ్లుగా హోటల్ నడుపుతున్నాను. ఇడ్లి, దోశ చట్నీ కోసం గ్రాండర్తో పప్పు రుబ్బాల్సి ఉంటుంది. కరెంట్ ఒక్కో రోజు 4 నుంచి 6 గంటల వరకు కోత ఉండేది. ప్రత్యామ్నాయంగా ఇన్వెర్టర్ పెట్టుకున్నాం. రూ.30వేలు ఖర్చు చేయాల్సి వచ్చింది. నిర్వహణ వ్యయం అదనం. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కరెంట్ కోతలే లేవు. అదనపు భారం లేదు.
– నర్సింగ్రావు, హోటల్ యజమాని, ఆలియాబాద్