6 లక్షల క్వింటాళ్ల విత్తనాల ఉత్పత్తి
10 రాష్ర్టాల్లో మన విత్తుల వాడకం
వ్యవసాయ వర్సిటీ ఆధ్వర్యంలో కొత్తగా 51 వంగడాలు
వానకాలంలో 8 రకాల పంటలకు 15 వేల క్వింటాళ్ల విత్తనాలు
జూలై 15 వరకు అమ్మకానికి ఏర్పాట్లు
రాజేంద్రనగర్లో ఘనంగా విత్తన మేళా
శాస్త్రవేత్తల సూచనలతో సాగు చేయండి.. మంచి దిగుబడులు సాధ్యమే…
రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్ రావు
ప్రతి ఏటా మే 24న విత్తన పండుగ దినోత్సవం: వీసీ ప్రవీణ్ రావు
వ్యవసాయ యూనివర్సిటీ , మే 24: రైతన్నకు అండగా ఉంటూ.. అనతి కాలంలోనే దేశానికి అన్నం పెట్టే స్థాయికి వచ్చామంటే అది సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్ రావు అన్నారు. రాజేంద్రనగర్ ప్రొ.జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో మంగళవారం ఏర్పాటు చేసిన విత్తన మేళా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కేసీఆర్ రైతు పక్షపాతి అని, ధ్రువీకరించిన విత్తనాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచిందన్నారు. వాన కాలానికి ముందే రైతులను చైతన్యపర్చడం, కావాల్సిన విత్తనాలు, ఎరువులు, సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్నామంటే మనమెంతో ముందంజలో ఉన్నామో అర్థం చేసుకోవచ్చన్నారు.
వాతావరణ మార్పులకు తగ్గట్టుగా నూతన విత్తనాలను రూపొందించాలని శాస్త్రవేత్తలకు సూచించారు. తెలంగాణ నేడు ప్రపంచ విత్తన కేంద్రంగా రూపొందిందని పేర్కొన్నారు. ఏడేండ్లలో వర్సిటీ నిర్వహిస్తున్న విత్తన మేళాకు రైతుల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తున్నదని ఉప కులపతి డా.వి.ప్రవీణ్ రావు అన్నారు. అనతి కాలంలో దేశంలోనే తొలిసారిగా పీజేటీఎస్ఏయూ వివిధ పంటలకు చెందిన 51 వంగడాలను రూపొందించిందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో ఎక్కువ ఫలితాలిస్తున్నాయన్నారు. జూలై 10వ తేదీ వరకు వర్సిటీలో విత్తనాలు అందుబాటులో ఉంటాయన్నారు. తెలంగాణలో ప్రధాన పంటలైన వరి, కంది, మొక్కజొన్న, జొన్న, రాగులు, పత్తి, మిర్చి తదితర 8 పంటలు.. 44 రకాలకు చెందిన 15 వేల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హన్మంత్, వర్సిటీ రిజిస్ట్రార్ డా.ఎస్ సుధీర్ కుమార్, పరిశోధనా సంచాలకులు డా.జగదీశ్వర్, సీడ్ డైరెక్టర్ డా.జగన్ మోహన్ రావు, వర్సిటీ అధికారులు, శాస్త్రవేత్తలు , విద్యార్థులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.