సిటీబ్యూరో, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): శాంతి భద్రతల పర్యవేక్షణలో తెలంగాణ పోలీసులు దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో బంజారాహిల్స్లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను గత ఏడాది ఆగస్టు 4న ప్రారంభించారు. బషీర్బాగ్లో ఉన్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఇందులో టవర్ ‘ఎ’లో 18వ అంతస్తులో కొనసాగుతుంది. టవర్ ’బి’లో తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఇందులోనే మల్టీ ఏజెన్సీ ఆపరేటింగ్ సెంటర్ను కూడా నిర్వహిస్తారు. దీనిని సోమవారం హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించగా డీజీపీ అంజనీకుమార్, సీపీ సీవీ ఆనంద్ తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఏడాది నగరంలో భారీగా నిర్వహించే గణేశ్ నిమజ్జన శోభాయాత్రను బంజారాహిల్స్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచే పర్యవేక్షించనున్నట్లు సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఇదిలాఉండగా ఇక్కడ ఉపయోగించే టెక్నాలజీపై టెక్నికల్ ఎస్పీ పుష్ప మీడియాకు వివరించారు.
స్టేట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్
ప్రస్తుతం ప్రభుత్వం తరపున హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సేఫ్ సిటీ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేసిన సీసీకెమెరాలతో పాటు కమ్యూనిటీ సీసీ కెమెరాలను అనుసంధానం చేస్తున్నారు. శాంతి భద్రతలు, ట్రాఫిక్ పోలీసులు ఇక్కడి నుంచి పరిస్థితులను సమీక్షిస్తుంటారు. స్థానికంగా ఉండే 126 కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లతో ఇక్కడి అవసరమైనప్పుడు నెట్వర్క్ను ఏర్పాటు చేసుకునే సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. 2828 జంక్షన్లను అందులో 1322 ట్రాఫిక్ జంక్షన్లతో నెట్వర్క్ను ఏర్పాటు చేశారు. ఇందులో 38 ఫేషియల్ రికగ్నజైషెన్, 1322 జీపీఎస్ ఎనేబుల్డ్ కనెక్టెట్ పెట్రోల్ వాహనాలు, సుమారు 5 లక్షల కమ్యూనిటీ, నేను సైతం కెమెరాలు అనుసంధానమయ్యే విధంగా టెక్నాలజీని ఆధునీకరించారు. 152 ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ జంక్షన్లు, 25 మొబైల్ వీఎండీఎస్, 32 జంక్షన్లలో వాహనాలను లెక్కించే కెమెరాలు, 25 ఎస్ఓఎస్ , 130 జంక్షన్లకు వెరియబుల్ మేసేజ్లు, 90 పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్కు ఇక్కడి నుంచి పర్యవేక్షిస్తారు.
ట్రాఫిక్ అండ్ లా అండ్ అర్డర్
ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన చలాన్లు ఇక్కడి నుంచి జారీ అవుతాయి. ఇందులో ఏఎన్పీఆర్(నెంబర్ ప్లేట్ రిక్నగైజేషన్) కెమెరాలు కూడా ఉన్నాయి. దీంతో నెంబర్లను గుర్తిస్తుంది. వాహనాల రాకపోకలను లెక్కిస్తూ కమాండ్ అండ్ కంట్రోల్కు సమాచారం ఇస్తుంది. దీంతో ట్రాఫిక్ రద్దీని బట్టి సిగ్నల్ వ్యవస్థ పనిచేసే విధంగా చూడవచ్చు. నేరాలను అదుపు చేయడానికి కూడా ఈ కెమెరాలు ఉపయోగపడుతాయి. నేరం చేసిన వాహనం ఎక్కడక్కెడ తిరిగింది.. ఫలాన వాహనం నేరం చేసిందని అలర్ట్ రాగానే వెంటనే ట్రాఫిక్ పోలీస్ అలర్ట్ అవుతూ వాహనాన్ని గుర్తిస్తారు. ఇటీవల ఒక కిడ్నాప్కు సంబంధించిన కేసులో ఈ కెమెరాలతో వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు పట్టేసి, శాంతి భద్రత పోలీసులకు అప్పగించారు. ట్రాఫిక్లో టెక్నాలజీపై డీఎస్పీ నర్సింగ్రావు వివరించారు.
మల్టీ ఏజెన్సీ ఆపరేషన్స్
మల్టీ ఏజెన్సీ ఆపరేషన్ కేంద్రంలో జీహెచ్ఎంసీ, వాటర్వర్క్స్ అండ్ సీవరేజ్, హెచ్ఎండీఏ, డీటీసీపీ, హెల్త్, మున్సిపల్, విద్యుత్, ఎనర్జీ, మెట్రో, ట్రాన్స్పోర్టు తదితర విభాగాలకు సంబంధించిన సీసీ కెమెరాలు కూడా అనుసంధానమవుతాయి. విపత్తుల సమయాలలో అన్ని ప్రభుత్వ శాఖలు ఇక్కడి నుంచే పరిస్థితిని సమీక్షిస్తాయి, ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో చీఫ్ సెక్రటరీ, డీజీపీ, జీహెచ్ఎంసీ, సీపీ, ఆయా విభాగాల అధిపతులు, మంత్రులతో వార్ రూమ్లో సమావేశం నిర్వహించి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఈ టవర్స్పై హెలీప్యాడ్ కూడా ఉంది. వాతావరణ శాఖ, ఇరిగేషన్ డిపార్టుమెంట్లు కూడా వరదలు వచ్చినప్పుడు ప్రధాన భూమిక పోషిస్తాయి.