Hyderabad | దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ దాడితో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తెలంగాణ జనుల మనసు గతంలోకి తొంగిచూసింది. అధికారం కోసం, ఓట్ల కోసం, ఎన్నికల కోసం.. శాంతిభద్రతల సమస్యలు సృష్టించడం కాంగ్రెస్కు అలవాటైన విద్యే. కుర్చీల వేటలో అది నెత్తుటి వేట కొనసాగిస్తుంది. 1990లో జరిగిన సంఘటనలే ఇందుకు నిదర్శనం..
ఆ రోజు… 1990 డిసెంబర్ 7.. పాతబస్తీలో అల్లర్లు.. నగరమంతా పుకార్లు.. రాష్ట్రమంతా అలజడి.. గంగా-యమున తహజీబ్ సంస్కృతికి నిలువుటద్దంలా ఉన్న హైదరాబాద్ నరమేధంతో నిలువునా వణికిపోయింది. మర్నాడు సూర్యుడు ఉదయించేసరికి.. రాజధాని రక్తసిక్తమైంది. ఆనాడు అల్లరిమూకలు సృష్టించిన నరమేధంలో సుమారు 300 మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఐదారువందల మందికి గాయాలయ్యాయి. ఏకంగా 25 రోజుల పాటు హైదరాబాద్ కర్ఫ్యూ చెరలో బందీగా మిగిలింది. డిసెంబర్ చలిలోనూ నగరమంతా వేడెక్కింది. ఆ వేడి రాష్ట్రమంతా సెగలు కక్కింది. సున్నితమైన ప్రాంతాల్లో నెల రోజులు దినదిన గండంగా గడిచాయి.
సీఎం కుర్చీ కొట్లాటే ఆ నరమేధానికి కారణం. అప్పుడు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన మర్రి చెన్నారెడ్డి స్వయంగా చెప్పిన మాటలు ఇవి.. ‘నన్ను సీఎం పదవి నుంచి తొలగించేందుకు సొంత పార్టీ అయిన కాంగ్రెస్లోని ప్రత్యర్థులు చేసిన ‘ఇంజినీర్డ్ వయలెన్స్ ’(సృష్టించిన హింస).’
మర్రి చెన్నారెడ్డి తనయుడు, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్రెడ్డి ఇప్పుడు చెబుతున్న ప్రకారం… ‘ఒక కత్తితో హిందువును చంపి.. అదే కత్తితో ముస్లింను ఊచకోత కోసిన ఘటన అది. వాస్తవానికి అది మత కల్లోలం కాదు. ఒకరిని అధికారం నుంచి తొలగించేందుకు జరిగిన కుట్ర.’
ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా అవతరించిన హైదరాబాద్ చరిత్రలో కాంగ్రెస్ పాలన చూస్తే కొన్ని రక్తపు మరకలున్న పేజీలు కనిపిస్తాయి. అవన్నీ కాంగ్రెస్ నేతల పదవీ కాంక్షకు దర్పణం పడతాయి. ఓట్ల కోసం ఫీట్లు చేసే నాయకులను చూశాం. అధికారం కోసం తమలో తాము తన్నుకున్న సందర్భాలూ చూశాం! కానీ, ప్రజల కోసం.. ప్రజల చేత ఏర్పాటు చేసుకున్న ఈ ప్రజాస్వామ్యంలో కుర్చీల కోసం తమను ఎన్నుకున్న ప్రజలనే బలి చేసిన దౌర్భాగ్య రాజకీయాన్ని ఊహించగలమా? కానీ, కాంగ్రెస్ రాజకీయ ప్రస్థానంలో ఆ నెత్తుటి మరకలు నేటికీ పచ్చిగానే ఉన్నాయి. కుట్ర చేసిందెవరు? దాంతో కుర్చీ కోల్పోయిందెవరో? ముఖ్యం కాదు! తమ పంతం నెగ్గించుకోవాలన్న నాయకులను పెంచి పోషించిన రాజకీయ పార్టీ ఏదన్నది ప్రధానం!! నెత్తుటి సంస్కృతి దాని విధానం!!
ఎవరో రాజకీయ ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తే నమ్మాల్సిన అవసరం లేదు. సాక్షాత్తూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి స్వయంగా తమ స్వపక్ష నేతల వైపు వేలెత్తి చూపిన తర్వాత ఇంతకంటే రుజువు ఏం కావాలి? ఆ హింసా సంస్కృతి పునరావృతం కాదన్న గ్యారంటీ ఎవరిస్తారు?? ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో జోరుగా సాగుతున్న చర్చ ఇది. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై హత్యాయత్నమూ ఇదే కోవలో చూడాలని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. ఓట్ల స్థాయిలోనే పరిస్థితులు ఇలా ఉంటే… ఒకవేళ అధికారం ‘హస్త’గతమైతే పదవుల కోసం ఇదే దమననీతి కొనసాగించేందుకు కాంగ్రెస్ నేతలు ఏమాత్రం వెనుకడుగు వేయరని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా నోటిఫికేషన్ జారీ కాకముందే కాంగ్రెస్లో ముఖ్యమంత్రి నేనే అంటూ పలువురు నేతలు పోటీ పడి మరీ ప్రకటనలు చేస్తుండటం ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తున్నట్లయింది.
కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ అంటేనే కర్ఫ్యూలకు కేరాఫ్. దశాబ్దాల పాటు ఏటా ఏదో సందర్భంలో బందుల ఇబ్బందులను భాగ్యనగరి చవి చూసింది. మతసామరస్యానికి ప్రతీకగా ఉండే రాజధానిలో తరచూ ప్రశాంతత భగ్నం కావడం వెనుక అనేక కారణాలున్నాయి. జాతీయ అంశాలు కొన్నయితే… స్వార్థ రాజకీయ శక్తుల కుటిల యత్నాలు కూడా హైదరాబాద్ను… హైదరాబ్యాడ్ అనే పేరిట పత్రికలకు ఎక్కించాయి. 1978 మొదలుకొని ఏటా మత కలహాలకు తోడు హత్యలు, మారణకాండలు, దోపిడీలు, దొమ్మీలు చోటుచేసుకునేవి. ప్రతి ఎన్నికల సమయంలో ఓటు రాజకీయ క్రీడల్లో కత్తిపోట్లు చోటు చేసుకునేవి. దీంతో పెట్టుబడులు రాక, ఉపాధి అవకాశాలు పెరగక.. హైదరాబాద్ ఆగమైంది. 1978 నుంచి 1985 వరకు ఏటా మత ఘర్షణలు జరిగాయి. తర్వాత మూడేండ్లు కాస్త ప్రశాంతంగా కనిపించినా.. మళ్లీ 2012 వరకూ హైదరాబాద్ను ప్రతి సంవత్సరం కర్ఫ్యూ పలకరించింది. 37 ఏండ్లలో జరిగిన ఘర్షణల్లో 554 మంది ప్రాణాలు కోల్పోగా, 4,798 మంది గాయాలపాలైనట్టు పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. కానీ, వాస్తవ సంఖ్య ఇంతకన్నా ఎక్కువగా ఉంటుందనేది నిజం. అప్పటి పరిస్థితి ఎలా ఉండేదంటే… ‘అరెరరె ఏందిరన్న ఏం జేస్తమన్న ఎటు జూస్తమన్న బందు.. ’ పాట నగర పరిస్థితికి అద్దం పడుతుంది.
హైదరాబాద్ ప్రస్థానంలో 1990లో జరిగిన మత ఘర్షణలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయి. మర్రి చెన్నారెడ్డి 1989, డిసెంబరు మూడో తేదీన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మరుసటి ఏడాదే నగరంలో రెండుసార్లు మత ఘర్షణలు చెలరేగాయి. 1990 అక్టోబరు 29న చోటుచేసుకున్న ఘర్షణలతో 23 రోజుల పాటు నిరవధిక కర్ఫ్యూ కొనసాగింది. తర్వాత 10-15 రోజుల్లోనే మళ్లీ మొదలైన ఘర్షణలు హైదరాబాద్ను అట్టుడికించాయి. ఈ దఫా కూడా 25 రోజుల పాటు కర్ఫ్యూ విధించారు. అధికారిక లెక్కల ప్రకారం ఆ ఏడాది జరిగిన హింసలో 208 మంది చనిపోగా, 470 మంది గాయపడ్డారు. అయితే వాస్తవానికి ఇవి మత ఘర్షణలు కావని, కుర్చీల కొట్లాటలో కాంగ్రెస్ నాయకులు సృష్టించిన ఘర్షణలు అని స్వయానా అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రకటించడం గమనార్హం. అంటే.. అధికారం కోసం అమాయక జనాన్ని సైతం పొట్టన పెట్టుకునే రాజకీయ సంస్కృతి ఉందనే కఠోర వాస్తవం బయటి ప్రపంచానికి తెలిసింది.
యథా రాజా… తథా ప్రజా అని ఊరికే అనలేదు. పాలకుల చిత్తశుద్ధికి అనుగుణంగా పరిపాలన విధానం కొనసాగుతుంది. అందుకే హైదరాబాద్ నగర ప్రస్థానం తెలంగాణ ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత అనే రీతిలో కనిపిస్తున్నది. నగరంలో ఎప్పుడైనా, ఏమైనా జరగవచ్చనే భయం నుంచి దేశంలోనే అత్యంత ప్రశాంతమైన, సురక్షితమైన నగరం హైదరాబాద్ అని అంతర్జాతీయ ఖ్యాతికి ఎదిగింది. 2014 నుంచి ఇప్పటివరకు నగరంలోనే కాదు.. రాష్ట్రంలో ఎక్కడా కూడా కల్లోలాలు చెలరేగిన దాఖలాలు లేవు. హైదరాబాద్ చరిత్రలో వరుసగా పదేండ్లలో ఒక్క క్షణం కూడా కర్ఫ్యూ విధించని సరికొత్త రికార్డును కేసీఆర్ ప్రభుత్వం లిఖించింది. వాస్తవానికి పెట్టుబడులు పెట్టాలంటే అంతర్జాతీయ కంపెనీలు ప్రప్రథమంగా పరిశీలించే కొలమానం… శాంతిభద్రతలు. అవి సంతృప్తికరంగా ఉంటేనే ఆపై మౌలిక వసతులు, భౌగోళిక అనుకూలతలు ఇలా ఇతర అంశాల గురించి ఆలోచిస్తారు. నగరంలో శాంతిభద్రతలు పక్కాగా ఉండబట్టే విదేశాల నుంచి ఐటీ కంపెనీలు, బహుళ జాతి సంస్థలు రెక్కలు కట్టుకొని వచ్చి హైదరాబాద్లో వాలుతున్నాయి. పాలకుడు మత సామరస్యాన్ని కాపాడటంతో పాటు పటిష్టమైన శాంతిభద్రతలను నిర్వహిస్తున్నందునే… ప్రజలు కూడా అదే బాటలో నడుస్తున్నారు. అందుకు ఉదాహరణగా… గతనెల 28వ తేదీన గణేష్ నిమజ్జనంతో పాటు అదేరోజు మిలాద్-ఉన్-నబీ కూడా వచ్చింది. రెండు పర్వదినాలూ ఒకేరోజు జరగడం ఇబ్బందిగా ఉంటుందని గుర్తించిన ముస్లిం సోదరులు మిలాద్-ఉన్-నబీ ఊరేగింపును వాయిదా వేసుకొని మతసామరస్యానికి హైదరాబాద్ నిలయమని మరోసారి రుజువు చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉన్నా.. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. పదేండ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి-సంక్షేమం ఇవే తప్ప సామాజిక, మత, రాజకీయ ఘర్షణలు చోటుచేసుకోలేదు. ఈ దశాబ్దిలో రెండేసి సార్లు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు, ఇతర ఉప ఎన్నికలతోపాటు జీహెచ్ఎంసీ సహా స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా వచ్చాయి. ఎక్కడా చిన్నపాటి సంఘటనలు జరగలేదు. కానీ, తాజా ఎన్నికల్లో మాత్రం హింసా మార్గానికి ద్వారాలు తెరుచుకోవడం ఆందోళన కలిగించే పరిణామం. వాస్తవానికి తెలంగాణ రాజకీయ ప్రస్థానంలో ఇలాంటి సంస్కృతి ఎక్కడా కనిపించదు. ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమంలోనూ వ్యక్తిగత దాడులకు పాల్పడిన సందర్భాల్లేవు. కానీ, సోమవారం దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన కత్తి దాడి తెలంగాణ సమాజాన్ని తీవ్రంగా కలిచివేసింది. తెలంగాణ ఏర్పాటయ్యాక ఎన్నడూ చూడని విష సంస్కృతి మళ్లీ పురుడు పోసుకోవడం అందరినీ ఆలోచింపజేస్తున్నది. ఎన్నికల పోరులో భాగంగా ప్రతి కార్యకర్తను ప్రజాక్షేత్రంలో ఒక సైనికుడిగా మార్చాల్సిన నేతలు ఇలా భౌతిక దాడులకు పాల్పడే రీతిలో పురిగొల్పడం ప్రమాదకరమని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు బుద్ధిజీవులను ఆలోచింపజేస్తున్నాయి. ఈ పరిణామాలు దేనికి సంకేతం? అని వారిలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆలు లేదు… చూలు లేదు.. కానీ అప్పుడే కాంగ్రెస్ పార్టీలో సీఎం పదవి కోసం కిస్సా కుర్చీకా! పందేరం మొదలైంది.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తానే ముఖ్యమంత్రిని అంటూ ఏకంగా డిసెంబరు 9న ప్రమాణ స్వీకారం చేస్తానంటూ చెప్పుకుంటున్నారు. కొడంగల్ నియోజకవర్గ ప్రచారంలో భాగంగా ఆయన సోదరులు బహిరంగంగానే రేవంత్ సీఎం అవుతాడంటూ చెబుతున్నారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తన సీనియారిటీతో పాటు సామాజిక కోణంలోనూ సీఎం కుర్చీ తనదేనని పరోక్షంగా బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎం రేసులో తానున్నట్లుగా స్పష్టం చేస్తున్నారు.
ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి అసెంబ్లీకి పోటీ చేయకున్నా… తాను కూడా సీఎం రేసులో ఉన్నానని ప్రకటించుకున్నారు. ఒకడుగు ముందుకేసి… ఆ సమయమొస్తే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎలాగూ ఆర్నెల్ల సమయం ఉంటున్నందున తన కొడుకును రాజీనామా చేయించి, ఆ స్థానం నుంచి గెలుస్తానని చెప్పడం గమనార్హం.
నల్లగొండ జిల్లాకే చెందిన మరో సీనియర్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సైతం తనకూ ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు ఉన్నాయంటూ మదిలోని మాటను బయట పెట్టారు.
మరో సీనియర్ నేత జగ్గారెడ్డి సైతం తనకూ ముఖ్యమంత్రి కావాలని ఉందంటూ ప్రకటించారు.
ఉత్తమ్కుమార్రెడ్డి కూడా గతంలో ఇలాంటి సంకేతాలే ఇచ్చారు.
ఇలా… కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థులమంటూ ముందుగా ప్రకటించుకున్న వారు వీరైతే! ఇంకా కొంతమంది సమయం కోసం వేచి చూస్తున్న వాళ్లూ ఉన్నారు.టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి రేవంత్రెడ్డితోపాటు వచ్చిన ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా సీఎం రేసులో ఉన్నట్లు సాక్షాత్తూ టీపీసీసీ అధ్యక్షుడు ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. ‘సామాజిక కోణం అంశం వచ్చినపుడు గిరిజనురాలైన సీతక్క సీఎం ఎందుకు కాకూడదు?’ అని రేవంత్రెడ్డి వ్యాఖ్యానిస్తూ తన తరఫున ఆమెను తెరపైకి తీసుకువచ్చారు.
– గుండాల కృష్ణ