సిటీబ్యూరో, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): దేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక్కటే నార్కోటిక్ బ్యూరో, సైబర్ సెక్యూరిటీ బ్యూరోలను ఏర్పాటు చేసి.. నాలుగువేల మంది సిబ్బందిని అదనంగా నియమించిందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్సీఎస్సీ) చైర్మన్గా నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో బుధవారం బంజారాహిల్స్లోని హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సభ్యులందరూ కొత్త ఆలోచనలతో ముందుకు రావాలన్నారు.
జనాభా వేగంగా పెరుగుతుండటం, కొత్తగా మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాల ముప్పు పొంచి ఉండటంతో వాటిని అణిచే వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బ్యూరోలను ఏర్పాటు చేసిందని తెలిపారు. డ్రగ్స్ వాడటం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించేందుకు హెచ్సీఎస్సీలో యాంటీ నార్కోటిక్స్ ఫోరమ్ను ప్రారంభించవచ్చని సూచించారు. హెచ్సీఎస్సీ కార్యకలాపాలను మరింత మెరుగుపరచడం, నిధుల సేకరణకు కార్పొరేట్ సంస్థలను చేరుకోవడానికి సీఎస్ఆర్ ఫోరమ్ ఏర్పాటుకు చైర్మన్ ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా హెచ్సీఎస్సీ బృందం మహిళలు, సైబర్, రోడ్డు తదితర భద్రతలపై రూపొందించిన అవగాహన వీడియోలను ఆయన ఆవిష్కరించారు. ఈ సమావేశంలో అదనపు సీపీలు ఏఆర్ శ్రీనివాస్, సుధీర్బాబు, జాయింట్ సీపీ గజారావు భూపాల్, హెచ్సీఎస్సీ సెక్రటరీ జనరల్ చైతన్య తదితరులు పాల్గొన్నారు.