హైదరాబాద్ : తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం BRKR భవన్లో మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్తో కలిసి ఉన్నతాధికారులతో ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 17న పీవీ మార్గ్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వస్తామని తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే సభకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని అన్నారు.
ర్యాలీ సాగే ప్రధాన కూడళ్లలో జాతీయ పతాకాలతో బైక్ ర్యాలీలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సభకు లక్ష మంది వరకు వివిధ జిల్లాల నుండి వస్తారని పేర్కొన్నారు.
జిల్లాల నుంచి వచ్చే బస్సులు, ఇతర వాహనాల పార్కింగ్ కు అవసరమైన ప్రాంతాలను సభా స్థలికి దగ్గరలో గుర్తించి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. వచ్చిన వారికి తాగునీరు అందుబాటులో ఉంచాలని చెప్పారు. సభలో గిరిజన, ఆదివాసీ ల సంస్కృతి, సాంప్రదాయాలను తెలియజెప్పే విధంగా కళా ప్రదర్శనలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ హేందర్ రెడ్డి, అదనపు డీజీ జితేందర్, MAUD ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, GAD కార్యదర్శి శేషాద్రి, గిరిజన శాఖ కార్యదర్శి క్రిస్టినా జోంగ్తు, రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాస్ రాజు, రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధ ప్రకాష్, సమాచార శాఖ డైరెక్టర్ రాజమౌళి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.