మహాత్ముడి వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం నగరంలో పలు సంఘాలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు జాతిపితకు ఘనంగా నివాళులర్పించారు. (చిత్రంలో) గాంధీ ఆస్పత్రి ఎదుట ఉన్న బాపూజీ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తున్న విద్యార్థులు.
బాపూఘాట్లో ఘన నివాళులు
మెహిదీపట్నం జనవరి 30 : జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం లంగర్హౌస్ బాపూఘాట్లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, హోంమంత్రి మహమూద్ అలీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే ముఠాగోపాల్, ఎమ్మెల్సీ వాణిదేవి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీకుమార్తో కలిసి గాంధీ సమాధిపై పూలు చల్లి నివాళులు అర్పించారు. అనంతరం ధ్యాన మందిరంలో సర్వమత ప్రార్థనలలో పాల్గొన్నారు. బాపూఘాట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో ప్రొటోకాల్ సెక్రటరీ అరవింద్ సింగ్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, కలెక్టర్ అమయ్కుమార్, ఆర్డీవో వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు, నాంపల్లి బీఆర్ఎస్ ఇన్చార్జి సీహెచ్.ఆనంద్కుమార్గౌడ్, నాయకులు కావూరి వెంకటేశ్, మాజీ కార్పొరేటర్ బంగారి ప్రకాశ్ పాల్గొన్నారు.