హైదరాబాద్, అక్టోబర్ 12(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలోని 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రామంతాపూర్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్ను నిర్ణయిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ వెలువడినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ హైకోర్టుకు తెలియజేశారు. తదుపరి నోటిఫికేషన్ నెల రోజుల్లోగా వెలువడుతుందని ఆయన చెప్పారు. ఎఫ్టీఎల్ నిర్ధారణ నిమిత్తం నోటిఫికేషన్ ప్రతిపాదనలను 2016లో పంపామని, కాగా, అనుమతి రావాల్సి వుందని ఈ నెల 10న జరిగిన విచారణ సమయంలో కమిషనర్ హైకోర్టుకు తెలియజేశారు. ప్రాథమిక నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుందో స్పష్టం చేయాలని, సదరు విచారణలో హైకోర్టు ఆదేశించడంతో పైవివరాలను కమిషనర్ హైకోర్టుకు గురువారం నివేదించారు. శాసనసభకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని రెండు నెలల్లోగా చెరువుకు కంచె ఏర్పాటు, చెరువులో పూడికతీత వంటి చర్యలు చేపడతామని చెప్పారు.
ఈ వివరాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరథే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ల ద్విసభ్య ధర్మాసనం తదుపరి విచారణను డిసెంబర్ 28కి వాయిదా వేసింది. 25 ఎకరాల విస్తీర్ణంలోని రామంతాపూర్ పెద్ద చెరువును డంపింగ్ యార్డుగా మారుస్తున్నారని, దీంతో ఆ ప్రాంతంలో నీటి కాలుష్యంతో పాటు దుర్వాసన వ్యాప్తి అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ కె.ఎల్.వ్యాస్ 2005లో రాసిన లేఖను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి విచారణ చేపట్టింది. కమిషనర్ ఇచ్చిన వివరణపై స్పందించిన హైకోర్టు, ఈసీ అనుమతి పొందిన తర్వాత 2 నెలల్లోగా చెరువులో పూడిక తీయాలని, ఇప్పటికే 400 మీటర్ల మేరకు కంచె వేశామని చెప్పిన కారణంగా, మిగిలిన 1471 మీటర్లకు కూడా కంచె నిర్మాణం చేయాలని ఆదేశించింది. ఈసీ నుంచి అనుమతులు లభించగానే చట్ట నిబంధనల ప్రకారం, టెండర్లను ఆహ్వానించి పనులు పూర్తి చేస్తామని కమిషనర్ చెప్పారు. డిసెంబర్ 28న జరిగే తదుపరి విచారణకు కమిషనర్కు వ్యక్తిగత హాజరు నుంచి హైకోర్టు మినహాయింపు ఇచ్చింది.