సిటీబ్యూరో, అక్టోబర్ 30(నమస్తే తెలంగాణ):తెలంగాణ ఏర్పడ్డాక ఏ ఒక్కరోజూ నగరంలో కర్ఫ్యూ లేదని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్లో గంగా జమున తెహజీబ్ తరహాలో మతసామరస్యం వెల్లివిరిసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జలవిహార్లో హైదరాబాద్ జిల్లాలోని పలు నియోజకవర్గాలకు చెందిన మైనార్టీ నేతలతో ఆయన ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. హోంమంత్రి మహమూద్ అలీతో పాటు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నేతలు షేక్ అబ్దుల్ సొహైల్, అర్హమ్ అదిల్కు గులాబీ కండువాకప్పి మంత్రి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మైనార్టీలకు మిత్రులెవరో, శత్రువులెవరో తెలుసుకుని ఓటేయాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు చేరాయని, హ్యాట్రిక్ విజయంతో కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని ఆయన కోరారు.
తెలంగాణ ఏర్పడ్డాక నగరంలో ఏ ఒక్కరోజూ కర్ఫ్యూ లేదని, గంగా, జమున, తెహజీబ్ తరహాలో మత సామరస్యం వెల్లివిరిసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జలవిహార్లో హైదరాబాద్ జిల్లాలోని పలు నియోజకవర్గాలకు చెందిన మైనార్టీ నేతలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, మహమూద్ అలీ, మాగంటి గోపీనాథ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నేతలు షేక్ అబ్దుల్ సోహైల్, అర్హమ్ ఆదిల్కు కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా మైనార్టీలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ఓట్ల కోసం తెలంగాణలో మత విద్వేషాలను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రేరేపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇన్నాళ్లు ముస్లింలు, క్రిస్టియన్లను కేవలం ఓటు బ్యాంకుగానే చూసిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు… అధికారం కోసం బీఆర్ఎస్పై ఆరోపణలు చేస్తున్నాయన్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత అన్ని మతాలకు ప్రాధాన్యతనిచ్చి, పేదోడికి సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా కేసీఆర్ పాలన కొనసాగించారని గుర్తు చేశారు.
గడిచిన 9ఏళ్లుగా ఎలాంటి అల్లర్లు, మత ఘర్షణలకు తావు లేదని, అన్ని మతాలకు ప్రాధాన్యతనిస్తున్న సీఎం కేసీఆర్ షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి వంటి పథకాలను అందజేస్తున్నారని తెలిపారు. ఇటీవల మిలాద్ ఉన్ నబీ, గణేశ్ నిమజ్జనం ఒకే రోజు వచ్చినా… హిందు మతానికి గౌరవిస్తూ సామరస్యంగా రెండు కార్యక్రమాలు జరుపుకొన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆర్ఎస్ఎస్కు చెందిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి, శాంతి, సామరస్యం నిండిన తెలంగాణను కల్లోలిత ప్రాంతంగా చేయాలని చూస్తున్నాడని కేటీఆర్ ఆరోపించారు. అన్ని మతాలను గౌరవిస్తూ కేసీఆర్ పండుగ కానుకలను అందిస్తున్నారు. ఇన్నాళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ముస్లిం, క్రిస్టియన్లను కేవలం ఓట్ల కోసమే వాడుకున్నాయని, వారి అభ్యున్నతికి మాత్రం సీఎం కేసీఆర్ కృషి చేశారన్నారు. తెలంగాణలో మైనార్టీల సంతోషాన్ని చూడలేక మత రాజకీయాలకు తెర లేపుతున్నారన్నారు. బీఆర్ఎస్ ఎప్పటికీ బీజేపీకి బీ టీం కాదనే విషయాన్ని మైనార్టీలు గ్రహించాలని సూచించారు. తెలంగాణలో హిందూ, ముస్లింలు ఐకమత్యంగా ఉంటూ జీవనం సాగిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ జనాల సంతోషాన్ని చూడలేక మత చిచ్చు పెడుతుందన్నారు. ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉండి మైనార్టీలపై కక్ష సాధించుకునే కుట్రలు చేస్తున్నాడని, ఇప్పటికైనా శత్రువులెవరో, మిత్రులెవరో గుర్తించి మైనార్టీలు ఓటేయాలన్నారు. మైనార్టీల అభ్యున్నతికి బీఆర్ఎస్ సర్కార్ కృషి చేస్తుందన్నారు. మైనార్టీలకు సముచిత స్థానాన్ని ఇస్తున్న బీఆర్ఎస్ను మరోసారి గెలిపించి కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎం చేయాలన్నారు. ఖైరతాబాద్లో ఖబరస్థాన్ వివాదాన్ని కూడా పరిష్కారస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ముస్లిం, క్రిస్టియన్లు ఐక్యంగా పనిచేసి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు.
కేసీఆర్ నేతృత్వంలోనే మైనార్టీలు సుభిక్షం : హోంమంత్రి
ఖైరతాబాద్, అక్టోబర్ 30: ‘యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో మైనార్టీలకు ఒరిగిందేమి లేదని, కేవలం ఓటు బ్యాంకుగానే చూశారే తప్పా..వారి అభివృద్ధికి ఎన్నడూ పాటుపడలేదని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రంలోని మైనార్టీలు సుభిక్షంగా ఉన్నారని పేర్కొన్నారు. జలవిహార్లో జరిగిన మైనార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు.సీఎం కేసీఆర్ సారధ్యంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషంగా వర్ధిల్లుతున్నారని, అలాంటి క్రమంలో మరోసారి ప్రజలను విడగొట్టేందుకు కాంగ్రెస్, బీజేపీలు వస్తున్నాయన్నారు. వారిని దగ్గరికి రానివ్వొద్దని, ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ మైనార్టీల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. జూబ్లీహిల్స్లో 3,500 మంది ముస్లింలకు షాదీముబారక్ పథకం ద్వారా సహాయం చేశామని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం మాజీ చైర్మన్ షేక్ అబ్దుల్లా సోహెల్ మాట్లాడుతూ.. డిసెంబర్ 3 తర్వాత రేవంత్ అండ్ బ్యాచ్ను ఇక్కడి నుంచి తరిమికొడుతామన్నారు.