Hyderabad Metro | సిటీబ్యూరో, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పక్కాగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది. రాబోయే 50 ఏండ్ల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని మహానగరానికి అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తోంది. మహానగర విస్తరణను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ హైదరాబాద్లో 415 కి.మీ మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. నగరం నలుమూలలా అత్యాధునిక ప్రజా రవాణా వ్యవస్థ అయిన మెట్రోను నిర్మించేందుకు ప్రత్యేక మార్గాలను రూపకల్పన చేశారు. మహానగరానికి మణిహారంలా ఉన్న ఔటర్ రింగు రోడ్డు తరహాలోనే నగరం చుట్టూ మెట్రో మార్గంతో ఒక వలయాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రస్తుతం ఉన్న మెట్రో రైలు మార్గాలను పొడిగిస్తూనే భవిష్యత్లో నగరం విస్తరించే ప్రాంతాలకు మెట్రో సౌకర్యం ఉండేలా ప్రణాళికను సిద్ధం చేశారు. దేశ రాజధాని ఢిల్లీ తర్వాత హైదరాబాద్ నగరంలోనే అత్యధిక కిలోమీటర్ల దూరం మెట్రో రవాణా వ్యవస్థ ప్రజలకు అందుబాటులో ఉండేలా కార్యాచరణ సిద్ధం చేసి క్షేత్ర స్థాయిలో పనులు మొదలు పెట్టారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న మెట్రో మార్గాల్లో ఢిల్లీ (348) తర్వాతి స్థానం హైదరాబాద్దే (69 కి.మీ)కాగా కొత్తగా ప్రతిపాదించిన మెట్రో మార్గాలతో ఢిల్లీతోనే హైదరాబాద్ పోటీపడనుంది. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబయిలో ప్రస్తుతం 46 కి.మీ మేర మెట్రో రాకపోకలు సాగుతుండగా, నిర్మాణంలో 145 కి.మీ ఉంది. అంతర్జాతీయ నగరాల సరసన హైదరాబాద్ నగరాన్ని నిలపాలన్న లక్ష్యంతో ముఖ్య మంత్రి కే.చంద్రశేఖర్ కొత్త మెట్రో మార్గాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే హైదరాబాద్ ప్రపంచంలోని టాప్ 20 నగరాల్లో ఒకటిగా ఉంది. ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థ పరంగా ప్రతిపాదిస్తున్న మెట్రో రైలు వ్యవస్థ హైదరాబాద్ కేంద్రంగా అందుబాటులోకి వస్తే భవిష్యత్లో అంతర్జాతీయ నగరాల్లో ఒకటిగా గుర్తింపు వస్తుంది.
ప్రముఖ మెట్రో నగరాలన్నింటికీ ఎయిర్ పోర్టుకు మెట్రో రైలు సౌకర్యం ఉన్నది. ఈ నేపథ్యంలో నగరంలోని ఏ మూల నుంచైనా శంషాబాద్ విమానాశ్రయానికి అతి తకువ సమయంలో చేరుకునేలా మెట్రో ప్రాజెక్టుని ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్ట్తో మరిన్ని పెట్టుబడులకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారబోతున్నది. మొత్తం 31 కిలో మీటర్ల పొడవుతో ఈ మెట్రో ప్రాజెక్టు ను రూ.6,250 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. గతేడాది డిసెంబర్ 9న సీఎం కేసీఆర్ ఎయిర్ పోర్టు ఎక్స్ప్రెస్ మెట్రోకు శంకుస్థాపన చేయగా, ఆ పనులు క్షేత్ర స్థాయిలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే మెట్రో మొదటి దశలో నిర్మించిన కారిడార్-3 (నాగోల్ నుంచి రాయదుర్గం) 29 కి.మీ ఉండగా, దానికి పొడిగింపుగా ఏయిర్పోర్టు మెట్రో ఎక్స్ప్రెస్ ప్రాజెక్టు మరో 31 కి.మీ మేర ఉంటుంది. ఈ మెట్రో ప్రాజెక్టును రెండో దశ ప్రాజెక్టుకు పరిగణిస్తుండగా, మూడో దశను నగరం నలుమూలలా విస్తరిస్తూ మొత్తం 415 కి.మీ మెట్రో మార్గం హైదరాబాద్ మహానగరంలో అందుబాటులోకి వచ్చేలా కార్యచరణ రూపొందించింది ప్రభుత్వం.
దేశంలో ఉన్న 7 ప్రధాన మెట్రో నగరాల్లో హైదరాబాద్ ఒకటి. అయినప్పటికీ వివిధ రంగాల్లో ఇతర మెట్రోల కన్నా ఎంతో ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని సమగ్ర రవాణా వ్యవస్థ ప్రణాళికను హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)రూపొందించింది. ప్రస్తుతం ఔటర్ రింగు రోడ్డు వరకు విస్తరించిన నగరం భవిష్యత్లో ఔటర్ రింగు రోడ్డు దాటి హెచ్ఎండీఏ పరిధి ఉన్న 50 కి.మీ వరకు విస్తరించే అవకాశం ఉంది. దీంతో మహానగర భవిష్యత్ ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా ముందస్తుగా సమగ్ర రవాణా వ్యవస్థ ప్రణాళికను ప్రైవేటు సంస్థలతో సమగ్ర రవాణా వ్యవస్థపై (సీటీఎస్) అధ్యయనం చేయించి ఒక నివేదికను రూపొందించారు. ప్రస్తుతం మొదటి దశలో 69 కి.మీ మార్గానికే పరిమితమైన మెట్రో రైలును వివిధ దశల్లో మొత్తం 415 కి.మీ మేర నిర్మాణానికి చర్యలు చేపట్టారు.
ఔటర్ రింగు రోడ్డు చుట్టూ ఉన్న గ్రోత్ కారిడార్లో అభివృద్ధి జోరందుకుంది. ముఖ్యంగా గ్రేటర్ చుట్టూ 158 కి.మీ పొడవుతో ఉన్న ఓఆర్ఆర్కు నగరంలోని వెస్ట్జోన్లోని ఐటీ కారిడార్తో అనుసంధానమైన ముత్తంగి నుంచి కొల్లూరు మీదుగా కోకాపేట, నార్సింగి, మంచిరేవుల, తెలంగాణ పోలీస్ అకాడమీ, రాజేంద్రనగర్ల నుంచి శంషాబాద్ వరకు ఉన్న ఔటర్కు ఇరువైపులా ఒక కి.మీ మేర నిర్ణయించిన గ్రోత్ కారిడార్లో భారీ నిర్మాణ రంగ ప్రాజెక్టులు వందల సంఖ్యలో పురోగతిలో ఉన్నాయి. 3-5 ళ్ల కాలపరిమితితో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయితే ఈ ప్రాంతం రూపు రేఖలు ఒక్కసారిగా మారిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం కోకాపేటలో హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తున్న 530 ఎకరాల లేఅవుట్లో ఇప్పటికీ పలు ప్రైవేటు నిర్మాణ రంగం 40,50 అంతస్తులతో కూడిన భవనాల నిర్మాణాలను ఐటీ కార్యాలయాలు, అందులో పనిచేసే ఉద్యోగుల నివాసాల కోసం రెసిడెన్షియల్ ప్రాజెక్టులను ఈ ప్రాంతంలోనే చేపట్టారు. వాక్ టు వర్క్ కాన్సెప్ట్తో రూపొందిస్తున్న ఈ ప్రాజెక్టు మంచి భవిష్యత్ ఉంటుందని పట్టణ ప్రణాళిక నిపుణులు చెబుతున్నారు. మాదాపూర్లో మొదలైన ఐటీ కారిడార్ అభివృద్ధి ఇప్పుడు గచ్చిబౌలి, నానక్రాంగూడ, కోకాపేట, నార్సింగి, పుప్పాల్గూడ ప్రాంతాల్లో విస్తరించింది. జాతీయ,అంతర్జాతీయ కంపెనీలు తమ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా ఈ ప్రాంతాలను ఎంపిక చేసుకుంటుండంతో భవిష్యత్తులో మరిన్ని ఐటీ,ఐటీఈఎస్ రంగాల్లోని కంపెనీలు ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈవిషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ఔటర్ రింగు రోడ్డు చుట్టూ మెట్రో మార్గాన్ని ఒక వలయం (రింగు) మాదిరిగా ప్రత్యేకంగా డిజైన్ చేసింది.