మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 7,500 ఎకరాలలో వరిసాగు
18, 750 మెట్రిక్ టన్నుల వడ్లు దిగుబడులు వస్తాయాని అంచనా
మండలాల వారీగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు
నేడు కలెక్టరేట్లో అధికారులతో మంత్రి మల్లారెడ్డి సమీక్ష సమావేశం
మేడ్చల్, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : యాసంగి వడ్ల కొనుగోలుకు కేంద్రం ముఖం చాటేసినా రైతన్నల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ మేరకు కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనపై రైతాంగం హర్షం వ్యక్తం చేసింది. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో 7,500 ఎకరాలలో వరిపంటను సాగు చేయగా, సుమారు 18, 750 మెట్రిక్ టన్నుల దిగుబడులు రానున్నట్లు వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వడ్ల కొనుగోలుకు మండలాల వారీగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బుధవారం కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కలెక్టరేట్లో కలెక్టర్తో కలిసి ప్రత్యేక సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు
వడ్ల కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేస్తాం. ఈ మేరకు కలెక్టర్ హరీశ్, అధికారులతో కలిసి బుధవారం సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం. పండించిన ప్రతి వడ్ల గింజను కొనేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. రైతులు అన్యాయానికి గురి కావద్దనే కేంద్ర పభుత్వం కొనుగోలు చేయకున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ వడ్లు కొనుగోలు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు అని నిరుపించుకున్నాడు.
– కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
సీఎం నిర్ణయం చారిత్రాత్మకం
రాష్ట్రంలోని రైతులు యాసంగిలో పండించిన వడ్లను రాష్ట్ర ప్రభుత్వం కొనాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించడం చారిత్రాత్మకం. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు మొండిచేయి చూపించినా, రైతులను ఆదుకునేందుకు నిర్ణయం తీసుకోవడం సీఎం కేసీఆర్ చిత్తశుద్ధికి నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి. బీజేపీ రాష్ట్ర నేతలు కుటిల రాజకీయాలు మాని, రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలి. – మోతె శ్రీలత శోభన్రెడ్డి, డిప్యూటీ మేయర్
ఇది రైతు ప్రభుత్వం
ఇది రైతు ప్రభుత్వం అని చెప్పడానికి ఇదే నిదర్శనం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతులను ఆగం చేయడం చూడలేక ముఖ్యమంత్రి కేసీఆర్ యాసంగి వడ్ల కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నారు. వరి పండించిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేసింది. రైతుల పక్షాన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల ఆగ్రహనికి గురికాక తప్పదు. – ఉదారి వేణుగోపాల్, రైతు, వెంకటాపూర్
సీఎంకు రైతులు రుణపడి ఉంటారు
రైతులు నష్టపోకుండా ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయడం సంతోషంగా ఉంది. వడ్లు పండించిన రైతులందరూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వడ్లు కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వాని ఒప్పించలేని బీజేపీ నాయకులు గ్రామాలలో తిరగలేని పరిస్థితి వస్తుంది. వడ్ల కొనుగోలుకు ముందుకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు రైతులు రుణపడి ఉంటారు. – చందుపట్ల ధర్మారెడ్డి, రైతు, ఎదులాబాద్