చిక్కడపల్లి, నవంబర్ 27: జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమానికి 100 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్)రాష్ట్ర ద్వితీయ మహాసభలను ఆదివారం బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. జీవితంలో ఒక్కసారి పెన్ను పట్టిన పాత్రికేయుడు ప్రాణం పోయేదాకా దాన్ని వదలడని తెలిపారు. దేశంలో అత్యంత సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో మీడియా ప్రతిపక్ష పాత్రను పోషించాల్సిన అవసరం ఉన్నదని ఆయన పేర్కొన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా పోరాడి బలైన ఆనాటి జర్నలిస్టు షోయబుల్లాఖాన్ వారసులుగా సమస్యలపై పోరాడాలని పాత్రికేయులకు పిలుపునిచ్చారు. ఫెడరేషన్ అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ హనుమంత రావు, ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.వెంకట్రావు, ఆంజనేయులు, ఐఎఫ్డబ్ల్యూ కార్యదర్శి ఆనందం, టీడబ్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య, శాంతకుమారి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ తిరుమలగిరి సురేందర్, మధుకర తదితరులు పాల్గొన్నారు.