సిటీబ్యూరో, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టీ డయాగ్నోస్టిక్ సెంటర్ సేవలు రోగుల పాలిట వరంగా మారాయి. బస్తీ దవాఖానలు, పీహెచ్సీ, యూపీహెచ్సీ, సీహెచ్సీ, ఏరియా, జిల్లా హాస్పిటళ్ల నుంచి వ్యాధుల నిర్ధారణ కోసం రోగుల నుంచి నమూనాలు సేకరించి.. నారాయణగూడలోని టీ డయాగ్నోస్టిక్ సెంటర్కు పంపుతున్నారు. మెడికల్ రిపోర్టులను పరీక్ష ఆధారంగా ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా సంబంధిత ఆరోగ్యకేంద్రానికి పంపడమే కాకుండా సంబంధిత రోగుల సెల్ఫోన్లకు సైతం సమాచారాన్ని చేరవేస్తున్నారు.
గ్రేటర్ వ్యాప్తంగా 516 కేంద్రాల నుంచి..
గ్రేటర్ వ్యాప్తంగా 516 కేంద్రాల నుంచి వచ్చే నమూనాలను టీ-డయాగ్నోస్టిక్ సెంటర్లలో పరీక్షిస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి తెలిపారు. బస్తీ దవాఖానలు, యూపీహెచ్సీ, పీహెచ్సీ, సీహెచ్సీ తదితర ఆరోగ్య కేంద్రాల ప్రతి రోజు సుమారు 5వేలకు పైగా నమూనాలు సేకరిస్తున్నామన్నారు. గ్రేటర్ వ్యాప్తంగా ఏడాదికి 6 లక్షల నుంచి 7 లక్షల మంది రోగులు టీ-డయాగ్నోస్టిక్ ద్వారా సేవలు పొందుతున్నట్లు పేర్కొన్నారు.