ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంలోంచి పుట్టిన ఎన్నో పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఆయన తలపెట్టిన హరిత సంకల్పం వల్ల నేడు హైదరాబాద్ మహానగరం గ్రీన్ సిటీ ఆఫ్ ద వరల్డ్గా ఖ్యాతికెక్కింది. అదికూడా వరుసగా రెండోసారి. దేశంలో కేవలం రెండు నగరాలకు మాత్రమే ఈ హోదా దక్కగా అందులో మన సిటీ ఒకటి. అర్బన్, కమ్యూనిటీ ఫారెస్ట్రీలో ఆదర్శవంతంగా మారి ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలిచింది. పెద్ద సంఖ్యలో మొక్కలు, మినీ అడవులు ఏర్పాటు చేస్తూ ఆరోగ్యకరమైన, నివాస యోగ్యమైన నగరంగా రూపొందింది.
‘మాట తప్పేది లేదు.. మడమ తిప్పేది లేదు’ ఇది చాలా సందర్భాల్లో సీఎం కేసీఆర్ చెప్పే మాట. అన్నట్లుగానే ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దారు. 2018 ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు 111 జీవోను రద్దు చేశారు. ఫలితంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు గణనీయంగా మెరుగుపడతాయి. ఈ 84 గ్రామాల పరిధిలో నిర్మాణ రంగానికి అనుమతులు వచ్చి భూముల విలువ పెరగనుంది. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులకు ఈ గ్రామాలు వేదికలుగా మారనున్నాయి.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్.. ప్రజలకు మాట ఇచ్చారంటే అది శాసనమే! హామీ ఇచ్చే ముందే ఒకటికి రెండు సార్లు మథనం… ఆపై అమలుకు ముందు సుదీర్ఘ కసరత్తు… చివరకు మాటను నిలబెట్టుకుంటూ ప్రకటన. ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో అనేకసార్లు రుజువైన అంశం… తాజాగా 111 జీవో రద్దు విషయంలోనూ అమలైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలోనూ పలువురు పాలకులు ప్రజలకు దీనిపై హామీ ఇచ్చారు. కానీ అమలు చేయడంలో కనీస కసరత్తు చేయలేకపోయారు. చివరకు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ చేతులెత్తేశారు. కానీ సీఎం కేసీఆర్ 2018 ఎన్నికల సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చినట్లుగానే జీవో 111 రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే దానికి ముందు ఆయన చేసిన కసరత్తు, మథనం అంతా ఇంతా కాదు. కాగా జీవో రద్దు నేపథ్యంలో హైదరాబాద్ నగరాభివృద్ధి ఆకాశమే హద్దుగా దూసుకుపోనుంది. నగరం నైరుతి వైపు అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న ఒకే ఒక్క 111 జీవో రద్దు కావడంతో భూ బ్యాంకు కూడా గణనీయంగా పెరుగుతుంది. 84 గ్రామాల్లోని ప్రజలతో పాటు నగరాన్ని నమ్ముకొని వచ్చే సామాన్య, మధ్య తరగతి ప్రజలకూ నిర్మాణ రంగంలో ఊరట కలుగుతుంది. అందుకే 111 జీవో పరిధిలోని గ్రామాల్లో సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయి.
రంగారెడ్డి జిల్లా పరిధిలోని మొయినాబాద్, శంషాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్, గండిపేట మండలాల పరిధిలోని 84 గ్రామాల్లో 1996 నుంచి జీవో 111 ఆంక్షలు మొదలైన విషయం తెలిసిందే. ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జలాశయాలకు పది కిలోమీటర్ల రేడియస్లోని ఈ గ్రామాల్లో విధించిన అంక్షలతో భూమి విస్తీర్ణంలో కేవలం పది శాతంలో మాత్రమే శాశ్వత నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతి ఉంది. గ్రామాల పరిధిలో చేసే లేఅవుట్లలోనూ 60 శాతం మేర ఓపెన్ స్పేస్, రోడ్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇలా నగరానికి చేరువలో ఉండి… అభివృద్ధి ఆ గ్రామాలను దాటిపోతున్నా… 84 గ్రామాల పరిధిలోని 1,32,600 ఎకరాల భూములు కేవలం వ్యవసాయ, వినోద (రెసిడెన్షియల్, రిక్రియేషన్) జోన్లకు పరిమితమై ఇతర రంగాల్లో అభివృద్ధికి నోచుకోలేకపోయాయి. తద్వారా భూముల విలువ పక్కనే ఉన్న భూముల కంటే అత్యంత తక్కువగా ఉండటంతో పాటు ఉద్యోగ, ఉపాధి రంగాల్లోనూ ఆ గ్రామాల్లోని యువతకు స్థానికంగా అవకాశాలు లేకుండా పోయాయి.
మాట నిలబెట్టుకోలేకపోయిన వైఎస్…
111 జీవోను ఎత్తివేస్తామని ఉమ్మడి ఏపీలోనూ అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ జీవో ఎత్తివేసేందుకు మార్గాన్ని సుగమం చేయకుండా… కనీస కసరత్తు కూడా చేపట్టలేదు. దీంతో వైఎస్ ఇచ్చిన హామీ నీటి మీద రాతల్లాగానే మారింది. కానీ సీఎం కేసీఆర్ 2018 ఎన్నికల సందర్భంగా చేవెళ్లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ‘111 జీవోను ఎత్తివేస్తాం’ అని ప్రకటించారు. ఆ తర్వాత కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో హైదరాబాద్ నగరానికి గోదావరి జలాల భరోసా కల్పించారు. మరోవైపు కృష్ణాజలాల సరఫరాలోనూ సుంకిశాల పథకంతో శాశ్వత పరిష్కారాన్ని చూపారు. ఇలా రెండు జీవనదుల నుంచి హైదరాబాద్ మహా నగరానికి రానున్న వందేండ్లలోనూ తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టారు. జంట జలాశయాల నుంచి తాగునీటి సరఫరా అవసరాన్ని లేకుండా చేశారు. ఇలా చర్యలు చేపట్టిన తర్వాతనే 111 జీవో రద్దుపై నిర్ణయం తీసుకున్నారు.
ఇవీ ప్రయోజనాలు..
84 గ్రామాల పరిధిలో 111 జీవో ఎత్తివేతతో నగరానికి ఆనుకొని ఉన్న ఇతర ప్రాంతాల్లో మాదిరిగా అభివృద్ధి
పరుగులు పెడుతుంది.
ఎన్నో పరిశ్రమలు వస్తాయి
111 జీవోతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఈ జీవో ఎత్తివేతతో మరింత భూమి అందుబాటులోకి రానుంది. ఇక్కడ పరిశ్రమలు, ఐటీ కంపెనీలు నెలకొల్పడానికి అడ్డంకులు తొలగినట్టే. జీవోను ఎత్తివేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– కొల్లగల్ల భాస్కర్, ఈర్లపల్లి గ్రామం, చేవెళ్ల మండలం
ఎన్నో ఏండ్ల సమస్యకు పరిష్కారం..
మా ప్రాంత ప్రజలకు 111 జీవో అతి పెద్ద సమస్య. సీఎం కేసీఆర్ కేబినెట్ సమావేశంలో దీనిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏండ్ల నాటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో మాకు సంతోషంగా ఉంది. జీవో ఎత్తివేతతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. ఇది సీఎం కేసీఆర్ చలవే.
– ఎం.అనిల్, ఎన్కేపల్లి గ్రామం, చేవెళ్ల మండలం
ప్రజలకు మేలు జరుగుతుంది
రాష్ట్ర ప్రభుత్వం జీవో 111ను ఎత్తివేస్తామని కేబినేట్లో నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి జీవోను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఏ ప్రభుత్వం జీవోను ఎత్తివేస్తామని కేబినేట్లో నిర్ణయం తీసుకోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ దమ్మున్న నాయకుడు…జీవో 111 ఎత్తివేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది.
– ఎంఏ షుకూర్, మొయినాబాద్
వెయ్యి కొబ్బరికాయలు కొడుతా
జీవో 111 రద్దు చేస్తానని ప్రకటించిన సీఎం కేసీఆర్ పేరుపై వెయ్యి కొబ్బరి కాయలు కొడతా నని మాజీ ఎంపీ కొండా విశ్వే శ్వర్రెడ్డి మంగళవారం ట్వీట్ చేశారు. తాను టీఆర్ఎస్లో చేరిన క్రమంలో 2013లోనే హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం జీవో 111 రద్దు చేశారని, అందుకు హర్షిస్తూ దేవాలయానికి వెళ్లి వెయ్యి కొబ్బరికాయలు కొడుతానని తెలిపారు.
– మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి ట్వీట్
మాట నిలబెట్టుకోండి
ట్వీట్ చేసిన ప్రకారం రేపు ఉదయమే గుడికి వెళ్లి సార్ పేరుపై వెయ్యి కొబ్బరి కాయలు కొట్టి మాట నిలబబెట్టుకుంటారా అని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డిని టీఎస్టీఎస్ చైర్మన్ పాటిమీదటి జగన్మోహన్రావు ప్రశ్నించారు. మాట తప్పకుండా కేవీ రంగారెడ్డి వంశ ప్రతిష్టను కాపాడండి అంటూ ఆయన రీట్వీట్ చేశారు.
– టీఎస్టీఎస్ చైర్మన్ పాటిమీది జగన్ రీట్వీట్