కంటోన్మెంట్, ఏప్రిల్ 3 : ఆశ్రమ పాఠశాలలకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. కంటోన్మెంట్లోని బాపూజీనగర్లోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో దాదాపు రూ.27లక్షలతో సొలేరా, స్మార్ట్ డ్రైవ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదులను గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్ క్రిస్టినా జెడ్ చోంగ్దుతో కలిసి జయేశ్ రంజన్ సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… విద్యార్థులకు కంప్యూటర్లో ప్రావీణ్యత కల్పించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉన్నదన్నారు. కంప్యూటర్ విద్య ద్వారా విద్యార్థులకు ఎంతో నైపుణ్యత వస్తుందన్నారు. విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా బోధించాలని, ఇందుకోసం ఉపాధ్యాయులు సైతం అవసరమైతే శిక్షణ తీసుకోవాలని సూచించారు. పాఠశాలకు సొలేరా, స్మార్ట్ డ్రైవ్ సంస్థ అందించిన సహకారం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ కార్పొరేట్ రిలేషన్స్ హెడ్ అర్చన సురేశ్, సొలేరో సంస్థ ఫైనాన్స్ హెడ్ దర్శనా బాంటియా, చందన సర్వే, పాఠశాల ప్రిన్సిపాల్ లాలూ పాల్గొన్నారు.