గత అనుభవాల దృష్ట్యా కట్టుదిట్టమైన చర్యలు
పని ప్రదేశాల్లో టెంపరేచర్ చెకప్, వైద్య పరీక్షలు
మాస్కులు, సామాజిక దూరంతో పనులు
నిర్మాణ ప్రాంతాల్లోనే కార్మికులకు వసతులు
రాష్ట్రేతర కూలీలకు నిర్మాణ సంస్థలు అండ
కరోనా రెండోదశ విజృంభిస్తుండడంతో ఇతర రాష్ర్టాల నుంచి కూలీలు ఆందోళన చెందుతున్నారు. గత అనుభవాల దృష్ట్యా బిల్డర్లు అప్రమత్తమై వారి రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. కార్మికులకు భద్రత కల్పిస్తూ ముందు జాగ్రత్త చర్యగా కొవిడ్ నివారణ చర్యల్ని చేపడుతున్నారు. కార్మికులు నివసించే పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచడంతోపాటు అర్హత ఉన్న ప్రతి కార్మికుడికి కరోనా టీకా ఇప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. క్రమం తప్పకుండా హెల్త్చెకప్లు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా సైట్లలోనే ఉంటూ పనిచేసే వారికి అవసరమయ్యే నిత్యావసర సరుకులు, కూరగాయలు వంటివన్నీ వాళ్ల వద్దకు చేర్చేలా పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు.
హైదరాబాద్ రియాల్టీ రంగంపై దాదాపు 250 రంగాలకుపైగా ఆధారపడి ఉన్నాయి. అడ్డా కూలీ మొదలుకొని తాపీ మేస్త్రీలు, మార్బుల్ కటింగ్, వైరింగ్, పుట్టి, పెయింటింగ్ వర్కర్స్, సైట్ సూపర్వైజర్లు, సివిల్ ఇంజినీర్లు, బిల్డర్లు, డెవలపర్లు, ఇటుక బట్టీలు, ఇసుక వ్యాపారులు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, ఆర్కిటెక్చర్లు..ఇలా బడా పారిశ్రామికవేత్తల వరకు ఉన్నారు. దాదాపు బిల్డర్లు, డెవలపర్లు 2500 వరకు వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యక్షంగా నిర్మాణ సమయంలో సుమారు 5 లక్షల వరకు పనిచేస్తుండగా, మెటీరియల్ సప్లయి తదితర వాటిల్లో మరో 5 లక్షల వరకు పనిచేస్తున్నట్లు అంచనా. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 25 లక్షల కుటుంబాలు రియల్ రంగంపై ఉపాధి పొందుతున్నట్లు నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు. రాష్ర్టేతర కార్మికుల స్థానాన్ని భర్తీ చేసేందుకు మనవద్ద నైపుణ్యం ఉన్నవారి సంఖ్య తక్కువ. బీహార్ నుంచి తాపీ మేస్త్రీలు, ఛత్తీస్గఢ్, యూపీ, మధ్యప్రదేశ్ నుంచి సెంట్రింగ్ వర్కర్లు , ఒడిషా నుంచి ప్లంబింగ్, రాజస్థాన్ నుంచి మార్బుల్స్, టైల్స్, ఫ్లోరింగ్, ఫాల్సీలింగ్, పెయింటింగ్ వర్కర్లు, పశ్చిమబెంగాల్ నుంచి ఎలివేషన్ వర్కర్లు ఎక్కువగా పనిచేస్తున్నారు.
కార్మికులను జాగ్రత్తగా కాపాడుకుంటాం. బిల్డర్లు పనిచేస్తున్న సైట్లలోనే నిత్యావసర వస్తువులు, కూరగాయలు సమకూర్చుతున్నారు. థర్మల్ స్క్రీనింగ్లు, మెడికల్ చెకప్లు ఏర్పాటు చేశారు. పాజిటివ్ వస్తే ఐసోలేషన్ రూంల ఏర్పాటుకు వీలుగా చర్యలు చేపట్టాలని బిల్డర్లకు చెప్పాం. భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలవాలని హైదరాబాద్ క్రెడాయ్ ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తున్నాం. -రాజశేఖర్రెడ్డి, జనరల్ సెక్రెటరీ, క్రెడాయ్ హైదరాబాద్
నిర్మాణరంగంలో కీలకమైన రాష్ర్టేతర కార్మికుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం శాశ్వత భరోసానిచ్చే చర్యలు చేపట్టాలి. స్థానికంగా నైపుణ్యం ఉన్న కార్మికులు దొరకని పరిస్థితుల్లో వీరి సంక్షేమానికి కేంద్రం ప్రత్యేకంగా వలస కార్మికుల విధానం తీసుకురావాలి. ఆలిండియా రేషన్కార్డు, యునిక్ లేబర్ ఐడీ నెంబర్, ఇన్సూరెన్స్ తదితర భద్రతా చర్యలు కల్పించాలి. ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తినా కార్మికులు మనోధైర్యంతో పనిచేస్తారు. – కేవీ రామారావు, సుమధుర గ్రూప్ వైస్చైర్మన్
కరోనా తీవ్రమవుతున్న నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికుల శ్రేయస్సుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. పని ప్రదేశాల్లో కూలీలు మాస్కులు ధరించడం, శానిటైజేషన్ వంటి నిబంధనలను పాటించేలా చూస్తున్నాం. కొందరు భయపడుతూ తమ సొంతూళ్లకు వెళతామని అంటున్నారు. వారికి నచ్చజెప్పి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పనులు చేసుకొని జీవనోపాధి పొందేలా చేస్తున్నాం. -ఇంద్రసేనారెడ్డి, చైర్మన్, గిరిధారి హోమ్స్
పనిచేస్తున్న చోట నియమాలు పాటిస్తున్నాం. బిల్లర్లు శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంచుతున్నారు. కరోనా తిప్పలు ఇంకెన్నాళ్లు ఉంటాయో అర్థం కావడం లేదు. లాక్డౌన్లో పనిలేక చాలా ఇబ్బందులు పడ్డాం. అలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా ఉంటే బాగుంటుంది. -రాంబాబు, భవననిర్మాణ కార్మికుడు
తెలంగాణ ప్రభుత్వం భవన నిర్మాణ రంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. లాక్డౌన్ సడలింపు మాకు మరో జన్మ. లేకుంటే తిండికి, బతికేందుకు బాధలు పడేటోళ్లం. లాక్డౌన్ పెట్టొద్దు. కూలీల్లో చాలా మార్పు వచ్చింది. -రాజేష్మిశ్రా, కార్మికుడు, ఉత్తరప్రదేశ్
చేతినిండా పనులు దొరుకుతున్నవి. చేసిన అప్పులు తీర్చుకుంటున్నాం. మా గ్రామాల్లో సరైన ఉపాధి దొరకదు. ఇక్కడ నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్నవి. కరోనా భయం ఉన్నా జాగ్రత్తలు తీసుకుంటూ పనిచేస్తున్నాం. -జయదేవ్ ప్రసాద్, ఒడిషా