హైదరాబాద్ : ఆషాడ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఉత్సవాల నిర్వహణ కోసం వివిధ ఆలయాలకు ఆర్థికసాయంగా ప్రభుత్వం రూ.15 కోట్ల విడుదల చేసిందని ఆయన వెల్లడించారు. మంగళవారం సికింద్రాబాద్లోని శ్రీఉజ్జయిని మహంకాళి ఆలయం ఆవరణలో రాంగోపాల్పేట, మొండా మార్కెట్ డివిజన్లకు చెందిన వివిధ ఆలయాల కమిటీ సభ్యులకు ఆర్థికసాయం చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ బోనాల ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, మహంకాళి ఆలయ ఈఓ మనోహర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు అత్తిలి అరుణ గౌడ్, ఆకుల రూప, వివిధ దేవాలయాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.