Metro corridor : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెట్రో కారిడార్ల పొడిగింపునకు సంబంధించిన డీపీఆర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో హైదరాబాద్ ఉత్తర భాగంలో మెట్రో రైల్ కల నెరవేరబోతున్నది. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు 23 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి శామీర్పేట్ వరకు 22 కిలోమీటర్లు మెట్రో కారిడార్ల డీపీఆర్ల తయారీకి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
వెంటనే డీపీఆర్లను తయారు చేసి మెట్రో రైల్ ఫేజ్-2 ‘బి’లో భాగంగా కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపించాలని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని ప్రభుత్వం ఆదేశించింది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో ఈ రెండు కారిడార్ల డీపీఆర్ తయారీ విషయంపై చర్చించి ఈ మేరకు సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు.
ప్యారడైజ్ నుంచి మేడ్చల్ (23 కి.మీ లైన్) : ఈ లైన్లో తాడ్బంద్, సుచిత్ర, కొంపల్లి, కండ్లకోయ మీదుగా మేడ్చల్ వరకు మెట్రో రైల్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు.
జేబీఎస్ నుంచి మేడ్చల్ (22 కి.మీ లైన్) : కార్ఖానా, తిరుమలగిరి, అల్వాల్, హకీంపేట మీదుగా శామీర్పేట వరకు ఈ మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.