బంజారాహిల్స్,సెప్టెంబర్ 3: చిత్రపురి కాలనీలో అవకతవకల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంలోని మంత్రులపై నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఇందిరానగర్లోని మేకప్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కరుణాకర్రెడ్డి మాట్లాడుతూ.. సినీ కార్మికులకు రావాల్సిన ఇండ్లను అనర్హులకు కేటాయించారని పోరాటం చేస్తున్న తెలంగాణ సాధన సమితికి తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ మద్దతు ఇచ్చిందని, అయితే, ఎలాంటి ఆధారాలు లేకుండా మంత్రి తలసాని మీద సాధన సమితి నేతలు సీహెచ్.భద్రి, కస్తూరి శ్రీనివాస్ ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.
ఒకవేళ మంత్రులకు డబ్బులు ముట్టాయని నిరూపించగలిగితేనే ఆరోపణలు చేయాలని, అనవసరమైన ఆరోపణలు, అసభ్యకరమైన మాటలు సరికాదన్నారు. భవిష్యత్లో ఇలాంటి మాటలు మాట్లాడితే సహించేది లేదన్నారు. సినీ కార్మికులకు న్యాయం చేసేందుకు తెలంగాణ సినిమా ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. చిత్రపురిలో జరిగిన అవకతవకలపై పోరాటం చేయాల్సిందే.. కాని ఇలాంటి నిరాధారమైన ఆరోపణలతో కార్మికులకు ఎలాంటి న్యాయం జరగదన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ మేకప్ యూనియన్ అధ్యక్షుడు రఘు, ప్రధాన కార్యదర్శి మూర్తి, కోశాధికారి సాగర్, కేశవ్, రీతు, తదితరులు పాల్గొన్నారు.